కోదండకు షాక్, కార్నర్ చేస్తున్న కెసిఆర్: తేల్చేసిన శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పైన పావులు కదుపుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల కోదండరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోదండరామ్ పైన సీఎం కెసిఆర్ పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏడేళ్ల క్రితం కోదండరామ్ నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఏర్పడింది.
ఇందులో తెలంగాణలోని అన్ని సంఘాలు చేరాయి. ఉద్యోగ సంఘాలు కూడా రాజకీయ జేఏసీలో కీలకంగా పని చేశాయి. అయితే, ఇప్పుడు కోదండరామ్ నేతృత్వంలోని రాజకీయ జేఏసీతో ఉద్యోగ సంఘాలు తెగతెంపులు చేసుకున్నాయి. ఇందులో టిఆర్ఎస్ హస్తం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉద్యమం సమయంలో.. రాజకీయ జేఏసీలో భాగంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతగా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయన అప్పుడు కీలక నేత. ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ చక్రం తిప్పి ఉంటారని భావిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్... ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, పలు సూచనలు చేయడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోదండరామ్ను ఒంటరిని చేసేందుకు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
కెసిఆర్ సారథ్యంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్ర సాధనతో 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం పని చేస్తామని, బంగారు తెలంగాణ ఉద్దేశ్యంలో భాగంగానే జేఏసీ నుంచి బయటకు వస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
బుధవారం రాత్రి నాంపల్లిలో టిఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షులు, పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కెసిఆర్ సారథ్యంలో కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, ఇక జేఏసీతో అవసరంలేదని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచన మేరకే తెలంగాణ జేఏసీ ఊపిర పోసుకుందన్నారు.
కెసిఆర్ నేతృత్వంలో సాగిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు మమేకమయ్యారని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడారని చెప్పారు. నాటి ఉద్యమ నేత కేసిఆర్ నేడు సీఎంగా ఉన్నారని, తెరాస ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో జేఏసీకి బాసటగా ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.