వరంగల్ ఎన్కౌంటర్తో ఆత్మరక్షణలో టిఆర్ఎస్: దురదుష్టకరమని వినోద్
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ అంశంపై టిఆర్ఎస్ ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. వరంగల్ ఎన్కౌంటర్ దురదృష్టకరమని టిఆర్ఎస్ పార్టీ నాయకుల నుండే ఇప్పుడు మాట్లాడుతున్నారు.
వరంగల్ ఎన్కౌంటర్ పైన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తమది మావోయిస్టు అజెండా అని చెప్పిన కెసిఆర్... వారినే ఎన్కౌంటర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ప్రజాసంఘాలు తలపెట్టిన చలో అసెంబ్లీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది.
వరంగల్ ఎన్కౌంటర్, చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టుల సందర్భంగా ప్రభుత్వం ఇబ్బందులు కొని తెచ్చుకుంది. దీంతో, అధికార వరంగల్ ఎన్ కౌంటర్ పైన యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
వరంగల్ ఎన్కౌంటర్ దురదృష్టకరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నాలుగు రోజుల క్రితం చెప్పారు. తెలంగాణ పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా ఎన్ కౌంటర్ దురదృష్టకరమన్నారు.
తాజాగా, టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ వినోద్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. వరంగల్ ఎన్ కౌంటర్ దురదృష్టకరమని చెప్పారు. ఇక ముందు తెలంగాణలో ఎన్కౌంటర్లు జరగవన్నారు. తెలంగాణ అభివృద్ధికి మావోయిస్టులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు ఉద్యమకారుల్లా అభివృద్ధి కోసం పని చేస్తారన్నారు.