రాజయ్య వార్నింగ్.. పెరిగిన పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కలకలం..
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరంగా నిర్వహించిన ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్తబ్దుగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఆయన కామెంట్స్ ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచాయి.
రాజయ్య హెచ్చరిక..
ఒక తల్లి, తండ్రికి పుట్టినవాళ్లే అయితే.. ఇలా తల్లి రొమ్ము కోసే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే తండ్రి లాంటి వాడని.. అక్కడికి ఎవరు రావాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాలని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేళ రాజయ్య చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి. పాత విభేదాల నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రూపు రాజకీయాలు...?
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం,రాజయ్యల మధ్య గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. అప్పట్లో కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కవితకు స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్పై ఒత్తిడి తెచ్చారు. ఏవో కారణాల రీత్యా రాజయ్యకు,కేసీఆర్కు మధ్య గ్యాప్ పెరిగిందని అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. కడియం వర్గం దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించింది. అయితే..
Recommended Video
పొలిటికల్ హీట్ పెంచిన రాజయ్య
చివరకు కేసీఆర్ మాత్రం మళ్లీ రాజయ్యకే టికెట్ ఇచ్చారు. దీంతో ఆ ఎన్నికల్లో రాజయ్య గెలుపొందారు. అయితే ఎప్పటికైనా స్టేషన్ ఘన్పూర్ నుంచే తన వారసురాలితో రాజకీయ రంగప్రవేశం చేయించాలన్న ఆలోచనలో కడియం ఉన్నారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు కావ్య చేస్తున్న ప్రయత్నాలు రాజయ్యకు రుచించడంలేదని తెలుస్తోంది. చాలారోజులుగా ఈ విషయంలో మౌనం వహిస్తూ వచ్చిన రాజయ్య.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ మనసులో మాటలను కుండ బద్దలు కొట్టారని చెబుతున్నారు. నిజానికి 2018లో టీఆర్ఎస్ విజయం తర్వాత.. ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా రాజకీయ విభేదాలేవీ బయటపడలేదు. ఇప్పుడు రాజయ్య వ్యాఖ్యలతో స్టేషన్ ఘన్పూర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.