ఎల్లో ఫీవర్కు కరోనాకు లింకు..? వినాయక్ 'కెన్యా' అనుభవం... అసలేంటిది...?
టాలీవుడ్ డైరెక్టర్ వివి వినాయక్ కరోనా వైరస్కు సంబంధించి ఓ సూచనతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఇటీవల కరోనా గురించి సంక్షిప్తంగా వివరించిన ఇద్దరు వైద్యుల వీడియోలు వైరల్ అయ్యాయని... తన వీడియో వారికి చేరాలనే ఉద్దేశంతో చేస్తున్నానని చెప్పారు. గతంలో తాను ఒకసారి కెన్యా వెళ్లాల్సి వచ్చినప్పుడు... ఆ దేశంలోకి అడుగుపెట్టేందుకు 'ఎల్లో ఫీవర్' ఇంజెక్షన్ తప్పనిసరి అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఆ ఫీవర్ లక్షణాలు ఏవైతే చెప్పారో... ఇప్పుడు సరిగ్గా కోవిడ్ 19కి కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.
వినాయక్ ఏమన్నారు...
'గతంలో నేను ఒకసారి ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్లాను. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ను నివారించే ఇంజెక్షన్ను తప్పనిసరిగా వేసుకోవాలి. ఎల్లో ఫీవర్ గురించి అక్కడి డాక్టర్ను అడిగాను. ప్రస్తుతం కరోనా లక్షణాలుగా వేటినైతే చెబుతున్నారో.. సరిగ్గా వాటినే ఎల్లో ఫీవర్ లక్షణాలుగా చెప్పారు. ఊపిరాడకపోవడం,జ్వరం,ఒళ్లు నొప్పులు వస్తాయన్నారు. కాబట్టి ఆ ఇంజెక్షన్ కరోనాకు కూడా పనిచేస్తుందేమోనని నా అనుమానం. ఇటీవల కరోనా గురించి అద్భుతంగా వివరించిన ఇద్దరు వైద్యులకు నా సూచన చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.' అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు.
సూచన కోసమే...
ఎల్లో ఫీవర్ కరోనా వైరస్కు పనిచేస్తుందా అని తనకు తెలిసిన ఒకరిద్దరు వైద్యులను అడిగానని... దానికి వద్దని వారు సమాధానం చెప్పారన్నారు. అయితే ఎందుకు వద్దో సరైన కారణం మాత్రం వెల్లడించలేదన్నారు. దీనిపై ఆ ఇద్దరు వైద్యులు వివరణ ఇస్తారేమోనన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నట్లు తెలిపారు. తాను కేవలం ఆ వైద్యులకు సూచన చేసేందుకే ఈ వీడియో చేస్తున్నానని... ఎవరూ ఎల్లో ఇంజెక్షన్ని తీసుకోవద్దని వినాయక్ సూచించారు.
అసలేంటీ ఎల్లో ఫీవర్ కథ...
నిజానికి 1995 తర్వాత కెన్యాలో ఎల్లో ఫీవర్ కేసులు మళ్లీ నమోదు కాలేదు. కానీ అనూహ్యంగా 2016లో రెండు కొత్త కేసులను గుర్తించారు. మార్చి 15 2016,మార్చి 18,2016 మధ్య విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు కెన్యా వ్యక్తుల్లో ఎల్లో ఫీవర్ లక్షణాలను గుర్తించినట్లు కెన్యాకు చెందిన ఐహెచ్ఆర్ ఫోకల్ పాయింట్ డబ్ల్యూహెచ్ఓకి రిపోర్ట్ చేసింది. ఆ రెండు కేసుల్లోనూ బాధితులు పురుషులే కాగా... వారి వయసు 30-35ఏళ్లు. అంగోలా దేశం నుంచి వచ్చిన ఈ ఇద్దరు... ఎల్లో ఫీవర్ లక్షణాలతో ప్రయాణాలు కూడా చేశారు.
మొదటి కేసు... అతను మృతి...
మొదటి కేసులో... మార్చి 8,2016న బాధితుడిలో లక్షణాలు కనిపించాయి. మార్చి 12న అతను అంగోలాలోని లువాండా నుంచి నైరోబీకి వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడినుంచి మెరుగైన ఆస్పత్రి కోసం మరో ఆస్పత్రికి పంపించగా... శరీరంలోని పలు అవయవాలు అప్పటికే దెబ్బతినడంతో మృతి చెందాడు. ఇక రెండో కేసులో మార్చి 1న అతనిలో లక్షణాలు బయటపడగా... మార్చి 7న అతను లువాండా నుంచి కెన్యాకు ప్రయాణించాడు. కెన్యాలోని తన స్వస్థలమైన నమంగాకు వెళ్లాడు.
Recommended Video
రెండో కేసు... పేషెంట్ డిశ్చార్జి
అప్పటికే వ్యాధి తీవ్రత పెరగడంతో మార్చి 11న నైరోబీ వచ్చి ఓ ఆస్పత్రిలో చేరాడు. అయితే కొద్దిరోజులకే అతను ఎల్లో ఫీవర్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. అప్పటినుంచి కెన్యా ఎల్లో ఫీవర్ పట్ల మళ్లీ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికీ ఆ సమాచారాన్ని ఇవ్వడం,వారికి వ్యాక్సిన్ వేయడం తప్పనిసరి చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులకు సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ ఉన్నవారినే దేశంలోకి అనుమతిస్తారు.