షాక్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఆ తెలుగు ప్రొఫెసర్ల పాఠాలు
హైదరాబాద్: అపహరణకు గురైన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు ఐఎస్ఐస్ ఉగ్రవాదులకు పాఠాలు చెబుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం సంచలనం సృష్టించింది. వారిద్దరు కూడా లిబియాలోని సిర్టే ప్రావిన్స్లో ఇస్లామిక్ స్టేట్ క్యాడర్కు పాఠాలు చెబుతున్నారని మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి. వారిద్దరిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాలు చాలా కాలం క్రితం కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
ప్రొఫెసర్ సిహెచ్ బలరాం ఆంగ్ల భాషను నేర్పిస్తుండగా, గోపీ కృష్ణ కంప్యూటర్ పాఠాలు చెబుతున్నట్లు ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్లో ఓ వార్తాకథనం వచ్చింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ భాషా, కంప్యూటర్ నైపుణ్యాలను పెంచుకోవడానికి వారిద్దరి సేవలను వినియోగించుకుంటున్నారని ట్రిపోలీలోని భారత ఎంబీసికి, సిర్తే విశ్వవిద్యాలయానికి సమాచారం అందినట్లు ఆ పత్రిక రాసింది.
బలరాం భార్య సిహెచ్ శ్రీదేవికి ట్రిపోలీ ఎంబసి అధికారులు ఆ విషయాన్ని తెలియజేశారు. టీచర్లు కాబట్టి వారిద్దరిని ఉగ్రవాదులు గౌరవిస్తున్నారని నిరుడు ఆగస్టులో చెర నుంచి విడుదలైన విజయ్ కుమార్, రామకృష్ణ చెప్పినట్లు తెలుస్తోంది.
తాను పార్లమెంటు సభ్యుడి సహకారంతో విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని, తన భర్త కిడ్నాపర్లకు పాఠాలు చెబుతున్నట్లు తనకు తెలిపారని శ్రీదేవి చెప్పినట్లు ఎంబసీ అధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు కూడా తమకు చెప్పారని డిసి రాసింది.
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తన భర్త సేవలను వినియోగించుకుంటున్నారని, అందుకే ఇన్ని రోజులుగా బందీగా ఉంచుకున్నారని, లేకుంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకుంటారని ఆమె అన్నట్లు డక్కన్ క్రానికల్ రాసింది.
హైదరాబాదులోని ఆర్టీసి కాలనీకి చెందిన బలరామ్తో పాటు ఆయన సహోద్యోగి గోపికృష్ణను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. 2015 జులైలో భారత్కు రావడానికి టునీషియా విమానాశ్రయానికి వెళ్తుండగా వారిద్దరినీ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.