టెక్కీలకు శుభవార్త: ఐటి బూమ్పై ఇన్ఫోసిస్ మాజీ సిఈవో ఇలా..
ఇన్ఫోసిస్ మాజీ సిఈవో క్రిస్ గోపాలకృష్ణన్ టెక్కీలకు ఓ శుభవార్త చెప్పారు. ఐటి బూమ్ భారత్లో మరో 30 ఏళ్లు ఉంటుందని ఆయన అన్నారు.
హైదరాబాద్: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సిఈవో క్రిస్ గోపాలకృష్ణన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఓ శుభవార్త చెప్పారు. వృత్తిపరంగా తాను ఇన్ఫోసిస్ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినప్పటికీ కంపెనీతో తనకు మానసిక సంబంధం ఉందని ఆయన చెప్పారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జీవిత కాలాన్ని ఫణంగా పెట్టి నిర్మించిన సంస్థ నుంచి మానసికంగా బయటకు రాలేమని ఆయన అన్నారు. అయితే, అన్నింటికీ సిద్దంగా ఉండాలని ఆయన చెప్పారు.
తాము రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కంపెనీతో మానసిక సంబంధం ఎప్పటికీ తెగిపోదని ఆయన చెప్పారు. భారత్లో ఐటి బూమ్ మరో 30 ఏళ్లు ఉంటుందని ఆయన చెప్పారు. టెక్కీలకు ఆయన చెప్పిన శుభవార్త ఇదే. ప్రతి పరిశ్రమతో పాటు మన జీవితంలో అన్నింటికీ ఐటిని వినియోగిస్తుండడమే ఆ బూమ్కు కారణమని ఆయన అన్నారు.
ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగంలో ప్రవేశించేందుకు సరైన సమయం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. హెల్త్ కేర్, ఆటోమొబైల్ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఊపు మీద ఉంటాయని ఆయన చెప్పారు. సమూల మార్పులకు ఆటోమొబైల్ వేదిక అవుతుందని చెప్పారు.
స్వయం చోదక కార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధనాన్ని సమర్థంగా వాడే వాహనాల వంటి ఎన్నో ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన చెప్పారు.