నోట్ల రద్దుకు ముందు... ఆ వివరాలూ ఇవ్వండి: మరో బాంబు పేల్చిన ఐటీ శాఖ
రూ.500, రూ.1000 నోట్ల రద్దు, బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను శాఖ అధికారులు మరో బాంబు పేల్చారు.
న్యూఢిల్లీ/హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు, బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ల గడువు ముగిసిన అనంతరం ఆదాయ పన్ను శాఖ అధికారులు మరో బాంబు పేల్చారు. రూ.15 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకులకు చేరాయన్న అంచనాలతో ఐటీ శాఖ బ్యాంకు నగదు డిపాజిట్ పోకడల విశ్లేషణ ప్రారంభించింది.
ఈ క్రమంలో నవంబర్ 8కి ముందు బ్యాంకుల్లో జమ అయిన నగదు పైన కూడా ఆరా తీస్తోంది. ముఖ్యమంగా ఏప్రిల్ 2016 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఆయా బ్యాంకుల్లో నమోదైన డిపాజిట్ల వివరాలు పరిశీలిస్తోంది.
నోట్ల రద్దుకు ముందు నెలల్లో బ్యాంకింగ్ లావాదేవీలను పరిశీలిస్తున్న... ఐటీ శాఖ కో ఆపరేటివ్ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు నగదు డిపాజిట్ల నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది.
పాన్ కార్డు వివరాలు కానీ, పాం 60 గానీ సమర్పించని ఖాతాదారుల డిపాజిట్ల వివరాలు అందించాలని కోరింది. సంబంధిత వివరాలను ఫిబ్రవరి 2017లో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.