బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ సంస్థ! రూ.కోటిన్నర పోగొట్టుకున్న 120 మంది నిరుద్యోగులు
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో ‘సెరినక్స్’ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. సుమారు 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది.
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో 'సెరినక్స్' అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. సుమారు 120 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడింది.
బాధితులు ఈ మేరకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, సదరు సంస్థకు ఎండీలుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 కంప్యూటర్లు, 12 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. వీరు సెరినక్స్ పేరిట సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించి, అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేవారని చెప్పారు.
మంచి ప్యాకేజితో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కో వ్యక్తి నుంచి లక్ష లేదా లక్షన్నర రూపాయల వరకు వసూలు చేశారని, ఎన్ని నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, జీతాలు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.