నల్లగొండలో ఐటీ టవర్స్ ఏర్పాటు అందని ద్రాక్షేనా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కేవలం 100 కిలోమీటర్ల దూరం. రవాణా పరంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని కొన్ని శివారు ప్రాంతాల కన్నా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నల్లగొండ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కేవలం 100 కిలోమీటర్ల దూరం. రవాణా పరంగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లోని కొన్ని శివారు ప్రాంతాల కన్నా రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నల్లగొండకే దగ్గర. జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణాన్ని ఐటీ హబ్గా మారుస్తామన్న పాలకుల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి. ఏడెనిమిదేళ్లుగా ఊరిస్తున్న సమాచార సాంకేతిక (ఐటీ)కు నల్లగొండను హబ్గా మారుస్తామన్న మాట ప్రజలకు అందని ద్రాక్షగానే ఊరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రెండో శ్రేణి పట్టణాల్లో అంకుర పరిశ్రమ (స్టార్టప్)లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా జిల్లాలోనూ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. రెండు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్, అమరావతిలకు అత్యంత చేరువలో ఉండటమూ నల్గొండకు ప్రధాన సానుకూలాంశం.
స్టార్టప్ల ఏర్పాటుకే ప్రాధాన్యం ఇస్తున్నామన్న మంత్రి కేటీఆర్
దేశంలోనే అత్యధికంగా స్టార్టప్ల ఏర్పాటుకు వూతమిస్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపారు. టాస్క్, టీహబ్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామని, తెలంగాణ సర్కార్ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తోందన్నారు. అభివృద్ధిలో అసమానతలు తొలగాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆవల తెలంగాణలోని ఆరేడు పట్టణాల్లో ఐటీ పరిశ్రమ వృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
నల్లగొండలో ఐటీ పరిశ్రమ విస్తరణకు 69 ఎకరాల కేటాయింపు
దాదాపు ఏడేళ్ల క్రితం 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రెండో తరగతి పట్టణాలైన విశాఖపట్నం, కాకినాడ, వరంగల్, తిరుపతి, నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఐటీని విస్తరించి.. పరిశ్రమలు నెలకొల్పడంతోపాటు అక్కడి నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2010 సెప్టెంబర్ 28న అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టరు రిజ్వీ నేతృత్వంలోని కమిటీ ఉన్నత అధికారులు, పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విద్యాసంస్థలు, మేధావులతో ఓ సమావేశం ఏర్పరచి ఐటీ హబ్, ఇంక్యుబేటర్ కేంద్ర ఏర్పాటుకు తగిన సూచనలు, సలహాలు అందించాలని విజ్ఞప్తి చేసింది.
నాటి ఐటి మంత్రి కోమటిరెడ్డి హయాంలో ఇలా
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐటీ మంత్రిగా పనిచేసిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణానికి సమీపంలోని ఎల్లారెడ్డిగూడెంలో 399, 411, 412, 414, 415, 424, 425 సర్వే నంబర్లలో దాదాపు 69 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం ఇంక్యుబేటర్ హబ్ ఏర్పాటుకు కేటాయించింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సైబర్టవర్స్ తరహాలోనే.. ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)ల ఆధ్వర్యంలో ఆ స్థలంలో ఐటీ టవర్లు నిర్మిస్తామని కూడా అప్పటి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి రత్నప్రభ ప్రకటించారు. అయినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. దీని తర్వాత ప్రతిపాదనలు, స్థలాలు కేటాయించిన ఖమ్మంలాంటి జిల్లాల్లో ఐటీ టవర్స్ల నిర్మాణ పనులు జరుగుతుండటం గమనార్హం. అన్ని అర్హతలు ఉన్నా నల్లగొండ జిల్లాలో ఐటీ ఇంక్యుబేటర్ కేంద్రం ఏర్పాటుకు మాత్రం మోక్షం కలగడం లేదు.
ఏటా ఐదువేల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తి
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 30 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏటా ఇందులోంచి నాలుగు నుంచి ఐదు వేల మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని బయటకొస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఐటీ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని అనధికార అంచనా. స్థానికంగా ఎలాంటి ఐటీ కేంద్రాలు లేకపోవడంతో వారంతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై వంటి నగరాలకు వెళుతున్నారు.
స్టారప్లతో ఇంజినీరింగ్ యువతకు ఉపాధి
ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటుచేస్తే అందులో స్టార్టప్ పరిశ్రమలను స్థాపించి స్థానికులతో పాటు ఇంజినీరింగ్ పట్టభద్రులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలూ ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నూతన ఐటీ విధానం ప్రవేశంతో ఉపాధి కల్పించే ఇంక్యుబేటర్ కేంద్రాలకు పన్ను, స్టాంప్ డ్యూటి రద్దు చేయడం, ఐదేళ్ల పాటు విద్యుత్ బిల్లుల్లో 50 శాతం లాంటి భారీ ఎత్తున రాయితీలు అందిస్తుండటంతో స్టార్టప్ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చే వీలు ఉంటుంది.
మంత్రి, ప్రజాప్రతినిధులు చొరవ చూపితేనే..
ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ బలంగా ఉంది. మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు చొరవ చూపితే ఇంక్యుబేటర్ కేంద్రం ఏర్పాటు అంత కష్టమేమి కాదని పలువురు అంటున్నారు. ఐటీ కేంద్రం ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వారవుతారని ఇంజినీరింగ్ పట్టభద్రులు కోరుతున్నారు. ఐటీ కేంద్రం ఏర్పాటుకు గతంలో కేటాయించిన భూమి, అప్పుడు అధికారులు చేసిన ప్రతిపాదనలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఐటీ కేంద్రం ఏర్పాటయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.