యాంత్రీకరణ.. కృత్రిమమేథ..వీసాలపై ఆంక్షలు, 2018లో ఐటీ పరిశ్రమకు సవాళ్లే!
హైదరాబాద్: భారతీయ ఐటీ పరిశ్రమకు 2017 ఓ ఆసక్తికర సంవత్సరం. ఐటీ, ఐటీ ఆధారిత సేవలరంగం నగదు రూపేణా 8 నుంచి 10 శాతం స్థిరమైన వృద్ధిని సాధించడమే కాకుండా గతేడాది అంచనాలను కూడా మించిపోయింది.
అయితే ఏడాది మాత్రం అలా ఉండదు. 2018 సంవత్సరం భారతీయ ఐటీ పరిశ్రమకు గడ్డుకాలం కానుంది. వీసాల మంజూరు విషయంలో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలు విధిస్తున్న ఆంక్షలే ఇందుకు కారణం.
ఈ విషయాన్ని నాస్కామ్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి స్వయంగా చెప్పారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం భారతీయ ఐటీ పరిశ్రమకు కఠిన సవాల్ విసరనున్నట్లు పేర్కొన్నారు.
''డిమాండ్ పరంగా చూస్తే పెద్ద సవాళ్లేమి ఉండకపోవచ్చు. 8 నుంచి 10 శాతం వృద్ధితో ఐటీ పరిశ్రమ 150 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే వీసాల జారీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి, అలాగే యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాలు కూడా వలసదారులను తగ్గించే ప్రయత్నం చేయడం, వ్యాపారాన్ని మరింత సరళతరం చేయబోతుండడం.. ఇవన్నీ భారతీయ ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపించబోతున్నాయి...'' అని మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
2017 సంవత్సరం.. కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకోవడంతో పాటు, సరఫరా విషయంలోనూ వేగంగా వృద్ధిని కనబరిచింది. అయితే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఉద్యోగులు మాత్రం తమ నైపుణ్యాలను పెంచుకోవడంలో సవాల్ను ఎదుర్కొన్నారు.
'యాంత్రీకరణ, కృత్రిమమేథ కారణంగా వృద్ధిరేటు కాస్త తగ్గింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సంరక్షణవాద సంకేతాలు ఐటీ పరిశ్రమకు ప్రతికూలంగా మారాయి..' అని నాస్కామ్ ఛైర్మన్ పేర్కొన్నారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 చివరి నాటికి 5,900 అంకుర సంస్థలను డీఐపీపీ గుర్తించిందని ఆయన వెల్లడించారు.