కోలుకోవటం కష్టమే..! నాయకత్వ లేమితో ఇబ్బందిపడుతున్న టీ కాంగ్రెస్..!!
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిత అయోమయం కానునట్టు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లే సరైన కార్యాచరణ లేకపోవడం, ప్రజా సమస్యలపై పోరాడే ప్రణాళికలు సిద్దం చేసుకోలేక పోవడం, ముఖ్యంగా ప్రజాకర్షణ గల నేత లేకపోవడం, ఉన్న నేతల మద్య సఖ్యత లేకపోవడం వంటి అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ కష్టాల్లో కూరుకుపోతోంది. ప్రభుత్వ విధానలపై పోరాడే అవకాశం ఉన్నప్పటికి నేతలు ఎవ్వరూ పెద్దగా స్పందించక పోవడం కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి రాజేస్తోంది. వర్థంతులు, జయంతుల సందర్బంగా నలుగురు నేతలు గాంధీ భవన్ లో కనపడటం తప్ప వేరే కార్యక్రమానికి రూపకల్పన చేయలేకపోవడం విచారకరమని ఆ పార్టీ క్రింది స్థాయి నేతలు చెప్పుకు రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నేతలకు కాస్తో కూస్తో ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందా అంటే అది సోనియా గాంధీ మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమే. సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ ఈ సారి ఏ మేరకు బలపడుతుంది అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కనుమరుగవుతున్న కాంగ్రెస్..! తెలంగాణలో ప్రభావం కోల్పోయిన హస్తం పార్టీ..!!
దేశ వ్యాప్తంగా బీజేపి ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద బాగా పని చేసిందని చెప్పాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో యువ సారథి రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ ఉత్సాహంతో కదం తొక్కినట్టు కనిపించినా ఓట్ల రూపంలో మార్చుకోవడంతో ఘోరంగా విఫలమైనట్టు స్పష్టమైంది. అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ ప్రభావం పని చేసినట్టే తెలంగాణలో కూడా గులాబీ పార్టీ సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బీజేపి దెబ్బ తీస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కోలుకోలేని దెబ్బ తీసింది. దీంతో పార్టీ నామమాత్రపు కార్యాచరణకు కూడా ఉపక్రమించలేక పోతోంది. ఉన్న కొద్దిమంది నేతలు అడపాదడపా మీడియా సమావేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజా కార్యక్రమాల రూపకల్పనకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది.
నాయకత్వ లేమితో ఇబ్బందిపడుతున్న కాంగ్రెస్..! అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి..!!
అంతే కాకుండా బీజేపిలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఐనప్పటినుండి కాంగ్రెస్ పార్టీ కష్టాలు రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. దేశ రాజకీయాల్లో మోదీ ఎంట్రీకి ముందు వరకూ ఆ పార్టీ తీరు ఒకలా ఉంటే, జాతీయ రాజకీయాల్లోకి కాలు మోపటం ద్వారా మోడీ అప్పటివరకున్న చాలా రాజకీయ అంశాలను తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. జాతీయవాదాన్ని తీసుకురావటం.. దేశంలో అంతకు ముందెప్పుడూ లేని హిందూ ఓటు బ్యాంకు ఒకటి తయారు చేయటం లాంటివెన్నో చేశారు. వీటిని అర్థం చేసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికి తన పాత వాసనల్ని వదలని కాంగ్రెస్ కు.. మోడీ అనుసరిస్తున్న వ్యూహాలు ఒక పట్టాన అర్థం కావట్లేనట్టుగా పరిణమించాయి.
ఊరట నిస్తున్న సోనియా నియామకం..! పూర్వవైభవం ఖాయమంటున్న నేతలు..!!
ఇక మోదీ రెండోసారి బీజేపిని బంపర్ మెజారిటీతో అదికారంలోకి తీసుకురావడం కాంగ్రెస్ కు ఆసాంతం మింగుడు పడని అంశంగా పరిణ మించింది. దేశ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సీట్లను కోల్పోయిన పార్టీగా ముద్రవేసుకుంది. దీంతో ఏఐసీసీ అద్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేసే పరిస్థితులు తలెత్తాయి. అంతే కాకుండా వివిధ రాష్ట్రాల్లోని పీసీసీ నేతలు, కార్యనిర్వాహ అద్యక్షులు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు సమర్పించారు. దీంతో ప్రాంతీయ పరంగా కూడా పార్టీ బలహీనపడింది. ఐతే సోనియా నేతృత్వంలో పార్టీ మళ్లీ పట్టాలెక్కి పరుగులు తీస్తుందంటున్నారు కొంత మంది నేతలు.
పార్టీపై రాములమ్మ ప్రభావం..! పొంతనలేని ప్రకటనలతో అయోమయం..!!
అయితే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీ తీర్దం పుచ్చుకోబోతునారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా నిజమేనా అంటూ ఎవరో మీడియా వ్యక్తులు అడిగితే, తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, సోనియాతో తనకు మాంచి పరిచయం ఉందని, రాహుల్ కు తానెంత చెబితే అంతని రాములమ్మ చెప్పుకొస్తున్నారు. గాంధీభవన్ లో ఉన్న తన వ్యతిరేక వర్గం వ్యక్తులు కావాలని చెడు ప్రచారం చేస్తున్నారని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలే గాంధీభవన్ అంటే రాజకీయ నాటక స్థలం. అక్కడ పాత్రలు.. పాత్రదారులు ఎంతో మంది కనిపించినా అందరూ కథానాయకులే. అటువంటి చోట రాములమ్మపై కక్షగట్టి ఇలా దుష్ర్పచారం ఎవ్వరు చేస్తున్నారనేది కనిపెట్టేందుకు రాములమ్మ తన అనుచరులను రంగంలోకి దించినట్టు సమాచారం. ఇలాంటి పరిణామాలన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది.