రాజయ్య మూడోసారి జైలుకు: సారిక, పిల్లల మృతిపై కాల్ డేటా సేకరణ
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య జైలుకు వెళ్లడం ఇది మూడోసారి. గతంలో జిల్లా పరిషత్తు సిఇవోగా పనిచేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలపై 2006 డిసెంబర్ 8వ తేదీన అరెస్టయి జైలుకు వెళ్లాడు. మరోసారి తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి ఆయనను జైలుకు పంపించారు. ఇప్పుడు కోడలు సారిక, మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో మూడోసారి జైలుకు వెళ్లారు.
కాగా, సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతికి సంతాపసూచకంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో టిజివీసీ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. క్యాంపస్లోని మహిళా హాస్టల్ నుంచి మొదటి గేట్ వరకు ఈ ర్యాలీ సాగింది. టిజివీసి నాయకులు రంజిత్, శ్రావణ్, శివ, సుధీర్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇదిలావుంటే, జీవనభృతి కేసు విచారణ, ఆస్తుల పంపకం గొడవల నేపథ్యంలో సారిక మరణించడంతో హత్య కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గొడవ జరిగిన తర్వాత అనిల్తో పాటు రాజయ్య, మాధవి ఫోన్ కాల్ డేటా వివరాలపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.
గొడవ జరిగిన తర్వాత ఈ ముగ్గురు ఎవరికైనా ఫోన్ చేశారా, చేస్తే ఎవరికి చేశారనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. అనిల్ రెండో భార్య సనా, ఆమె తరఫు వ్యక్తులకు ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.