5 కంపెనీలతో ఎంవోయూ: తెలంగాణలో ఐటీని పరుగులు పెట్టిస్తున్న కేటీఆర్
మంగళవారం నగరంలోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఐ-తెలంగాణ 2017 సదస్సును ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించామని ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం నగరంలోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఐ-తెలంగాణ 2017 సదస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలను కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం తెలంగాణలో ఐటీ అభివృద్ది గురించి తన ప్రసంగం ద్వారా వివరించారు. రాష్ట్రంలోని ఐటీ సెక్టార్లో విజయవంతంగా 10 కొత్త పాలసీలను తీసుకువచ్చామని తెలిపారు.
గ్లోబల్ టెక్నాలజీ, ఆపిల్, గూగుల్ లాంటి సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చామని గుర్తుచేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త టెక్నాలజీలను అమలు పర్చడంలో ముందుందని తెలిపారు.
ఇదే ప్రాంగణంలో టీ- ఎయిర్ సమ్మిట్ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. టీ ఎయిర్ సమ్మిట్ మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ఇంటర్నెట్, రోబోటిక్స్ అంశాలపై చర్చించనున్నారు.
5కంపెనీలతో ఎంవోయూ:
సదస్సులో ఐదు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీలు బాగున్నాయని సైయెంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ టీహబ్ సహకారంతో రూపొందించిన స్మార్ట్ వాచ్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆ వాచ్ను కేటీఆర్ చేతికి పెట్టుకున్నారు.
ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. స్టార్టప్లకు హైదరాబాద్ను హబ్గా తీర్చిదిద్దామని, అంతర్జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందని అన్నారు.