టీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసం, కార్యాలయంలో ఐటీ సోదాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్నారావు నివాసం, కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. బుధవారం ఉదయం పలు దఫాలుగా ఐటీ అధికారులు ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు నిర్వహించారు.
ప్రస్తుతం కూకట్పల్లి వెంకటరావునగర్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు చెందిన ప్రణీత్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రణీత్ హోమ్స్ వ్యవహారంలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
సంస్థ ఎండీ నరేందర్, మరో ఐదుమంది డైరెక్టర్ల నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇది ఇలావుంటే, మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపింది.
కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. కాగా, తప్పుడు ధృవపత్రాలతో దేశ పౌరసత్వం పొందినందున రమేష్ ఎన్నిక చెల్లదంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆదిశ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తమ అభ్యంతరాలను కేంద్ర హోంశాఖకు మూడు వారాల్లోగా చెప్పాలని చెన్నమనేనికి, పిటిషనర్కు కోర్టు సూచనలు చేసింది. దీనిపై పున:సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గంలో పౌరసత్వం కలిగి ఉన్నారని గుర్తించింది. చెన్నమనేని భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని స్పష్టం చేసింది.