భారీగా బంగారం కొనుగోళ్లు: రద్దైన నోట్లతో రూ.100 కోట్లకుపైగా లావాదేవీలు?
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ ప్రకటించిన తర్వాత హైదరాబాదులోని దుకాణాల్లో పెద్ద యెత్తున బంగారం కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. దీంతో ఐటి శాఖాధికారులు ఆభరణాల దుకాణాలపై దాడులు నిర్వహించారు.
హైదరాబాద్: గత నెల 8వ తేదీన రూ..500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసిన తర్వాత హైదరాబాదులోని బంగారం దుకాణాల్లో పెద్ద యెత్తున లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఐటి అధికారులు శనివారంనాడు హైదరాబాదులోని ఆబిడ్స్, బంజారాహిల్స్, పంజగుట్టల్లోని జ్యుయెల్లరీ దుకాణాల్లో దాడులు నిర్వహించారు.
రద్దయిన పెద్ద నోట్లతో దాదాపు రూ.100 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. బంగారం దుకాణాల్లోని సిసి టీవీ ఫుటేజీలను ఐటి అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాదు పాతబస్తీల్లోని జ్యుయెల్లరీ షాపుల్లో కూడా ఐటి ఆధికారులు సోదాలు నిర్వహించారు.
పది కోట్ల మార్పిడి...
ఇదిలావుంటే, హైదరాబాదులోని ఆరు పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల నేపథ్యంలో అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. భారీగా నగదు మార్పిడి జరిగినట్లు గుర్తించారు. హిమాయత్నగర్, సనత్నగర్, , గోల్కొండ, ఆబిడ్స్ జిపివో, ఖైరతాబాద్ పోస్టాఫీసుల్లో అక్రమాలు జరిగినట్లు చెబుదున్నారు.
30 లక్షల మోసం..
హైదరాబాదులోని బంజారాహిల్స్ పరిధిలో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు తక్కువ ధరకే బంగారం ఇస్తానని వ్యాపారులకు ఆశ చూపించి మోసం చేశాడు. కొత్తనోట్లు తీసుకుని ఫిలింనగర్ గెస్ట్హౌస్కు రావాలని ఆ కాంగ్రెసు నేత సూచించాడు. వ్యాపారులు భారీ నగదుతో రాగానే ఆ కాంగ్రెస్ నేత తనకు అనుకూలమైన సీఐకి సమాచారం అందించాడు.
అక్కడికి చేరుకున్న సీఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు వ్యాపారుల వద్ద ఉన్న రూ.30లక్షల నగదు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత, సీఐ కుమ్మక్కై తమ వద్ద ఉన్న నగదు దోచుకున్నారని వ్యాపారులు అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్నేత, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
నోట్ల మార్పిడి కేసులో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్లో పాతనోట్ల మార్పిడి కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5లక్షల విలువైన 500, 1000 రూపాయల పాతనోట్లు, 2 ద్విచక్రవాహనాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు రాజేంద్రనగర్ సీఐ ఉమేందర్ చెప్పారు.
గత నెల 24న సికింద్రాబాద్కు చెందిన పవన్కుమార్ తన వద్ద ఉన్న రూ.7లక్షల పాతనోట్లు మార్చుకోవడానికి అత్తాపూర్లో ఉన్న సలీంను సంప్రదించాడు. మరో ఇద్దరు వ్యక్తులు అన్వర్, సర్వర్లతో కలిసి పవన్కుమార్ నుంచి రూ.7లక్షలు తీసుకుని పరారయ్యారు.
వెంటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిన్న సాయత్రం సలీం, సర్వర్ను అరెస్టు చేశారు. మరో నిందితుడు అన్వర్ పరారీలో ఉన్నాడు.