సోషల్ మీడియా ధాటికి ఉలిక్కిపడ్డ మై హోం..! ఐటీ దాడులపై వివరణ.. టీవీ 9తో సంబంధంలేదు..!!
హైదరాబాద్ : మై హోం గ్రూపు కంపెనీలపై ఐటీ దాడుల అంశం హాట్ టాపిక్గా మారింది. రెండు రోజులుగా మై హోం అధినేత రామేశ్వరరావు ఆఫీసులు, నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. టీవీ9 కొనుగోలు తదనతంర పరిస్థితులతో పాటు రాజకీయ కారణాలతోనే ఐటీ దాడులు జరుపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంటో మై హోం గ్రూప్ ఉలిక్కిపడింది. ఐటీ దాడులపై వివరణ ఇచ్చింది.
పారిశ్రామికవేత్త మై హోమ్ రామేశ్వర్రావు కార్యాలయం నివాసంలో ఐటీ దాడులు..?
ఐటీ దాడులపై ప్రకటన
మై హోం గ్రూపులో ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ దాడుల నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ దాడుల విషయంలో స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో భాగంగానే మై హోం గ్రూపు కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారని స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
బెంగళూరు కంపెనీ వల్లే
కన్స్ట్రక్షన్ బిజినెస్లో భాగంగా మై హోం గ్రూప్ హైదరాబాద్లో పలు నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో జాయింట్ వెంచర్ చేపట్టింది. సదరు కంపెనీపై దాడులు చేసిన ఐటీ అధికారులు దర్యాప్తులో భాగంగా మై హోం గ్రూప్ కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించినట్లు చెప్పింది. ఐటీ అధికారులు కోరిన సమాచారాన్ని అందించామని, మై హోం గ్రూప్ వ్యాపార కార్యకలాపాలన్నింటిలో విలువలు పాటిస్తుందని స్పష్టం చేసింది. పన్ను చట్టాలు, నియంత్రణ సంస్థల నిబంధనలు పాటించడంలో తమకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్న విషయాన్ని మై హోం గ్రూప్ గుర్తు చేసింది.
కేసీఆర్తో దోస్తీ
రాజధాని హైదరాబాద్ లో అత్యధిక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేస్తూ వస్తున్న మైహోం రామేశ్వరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు . ఈయన రాజకీయ పార్టీలకు ముఖ్యంగా టీఆర్ఎస్కు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తారన్న ప్రచారం ఉంది. కేసీఆర్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు రామేశ్వరరావుకు ప్రత్యేక ఆహ్వానం అందడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది. రామేశ్వరరావుతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే కేసీఆర్ ఆయనకు విలువైన భూములు అప్పనంగా అప్పజెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
కేసీఆర్తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే మై హోం రామేశ్వరరావు గ్రూప్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీకి టీఆర్ఎస్కు చెండిందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్ను దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన సన్నిహితున్ని టార్గెట్ చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాజాగా టీవీ 9 కొనుగోలు విషయంలో జరిగిన హై డ్రామా కూడా మై హోం గ్రూప్ కంపెనీల్లో ఐటీ సోదాలకు కారణమని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ధాటికి ఉలిక్కిపడ్డ మై హోం గ్రూప్ ఐడీ దాడులకు సంబంధించి ప్రకటన చేయడం కొసమెరుపు.