థర్డ్ ఫ్రంట్ కాదు.. ఫస్ట్ ఫ్రంటే, టీడీపీ అందుకే బయటికి: కేటీఆర్ సంచలనం
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించింది థర్డ్ ఫ్రంట్ కాదని, అది ఫస్ట్ ఫ్రంట్ అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం మంత్రి కేటీఆర్ ఢిల్లీలో జరిగిన 51వ స్కోచ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థర్డ్ ఫ్రంట్పై మీడియా పలుకరించగా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
భారత్ కేవలం రెండు పార్టీల వ్యవస్థ కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని, అధికారమంతా ఢిల్లీలో కేంద్రీకృతమైందని, అది సరికాదని అన్నారు. అందుకే కేసీఆర్ కొత్త చర్చ లేవనెత్తారని, అది మంచి పరిణామాలకే దారి తీస్తోందని కేటీఆర్ చెప్పారు.
అదనంగా ఒక్కపైసా రాలేదు...
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాలేదు.. రావాల్సిన నిధులే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు కూడా ఇదే జరిగింది.. అందుకే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిందనుకుంటున్నా.. అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నించే విధంగా ఫెడరల్ వ్యవస్థకు ప్రతిబింబంగా ఒక కొత్త ప్రత్యామ్నాయం వస్తే మంచిదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ చర్చకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏన్డీఏ ఆత్మవిమర్శ చేసుకోవాలి...
ఎన్డీఏ ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఎవరూ లేరని, బలహీనపడ్డ ఒక్క అకాలీదళ్ మాత్రమే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకు తన మిత్రపక్షాలను కోల్పోతుందో బీజేపీ ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు మెజారిటీ వచ్చే అవకాశం లేదని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ విఫలం...
ఈసారి కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. కేంద్రంపై రోజురోజుకు నమ్మకం పోతోందని కేటీఆర్ చెప్పారు. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ఎన్ని అవకాశాలిచ్చినా వారి ఆశయాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇక ప్రాంతీయ పార్టీలే కీలకం...
దేశంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని.. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలే కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రాలన్నీ శక్తివంతంగా తయారైతే భారతదేశం కూడా అంతే శరవేగంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ మంచి చర్చను లేవనెత్తారు...
అధికార కేంద్రీకరణ వల్ల దేశానికి అపార నష్టం జరుగుతోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఏ విధమైన పరిణామాలు సంభవిస్తాయో, థర్డ్ ఫ్రంట్ ఏవిధంగా రూపుదిద్దుకుంటుందో వేచి చూడాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్ మంచి చర్చను లేవనెత్తినట్లు తాను భావిస్తున్నానని, భవిష్యత్తులో ఇది తప్పకుండా మంచి పరిణామాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.