"ప్రతీ ఆదివారం ఇంటికొచ్చేది.. ఈసారి అనూహ్య వార్త!, భర్తే చంపేశాడు"
పద్మజ ముఖంపై, శరీరంపై గాయాలు ఉన్నాయని నాగేశ్వరరావు తెలిపారు. గతంలోను గిరీష్ తమ బిడ్డను చాలాసార్లు కొట్టాడని, నా కూతురిని అతనే హత్య చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు.
హైదరాబాద్: గచ్చిబౌలిలోని సుదర్శన్ నగర్లో పద్మజ అనే బ్యాంకు మేనేజర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులు.. పద్మజ భర్తను, ఆమె అత్తింటివారిని ఇందులో దోషులుగా చెబుతున్నారు. భర్త గిరీషే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని వారు బలంగా వాదిస్తున్నారు.
పద్మజ అనుమానాస్పద మృతిపై తాజాగా ఆమె తండ్రి నాగేశ్వరరావు స్పందించారు. ప్రతీ ఆదివారం తమ ఇంటికి వచ్చే కూతురి గురించి నిన్నటి రోజు మాత్రం అనూహ్య వార్త వినాల్సి వచ్చిందన్నారు. నిత్యం తమ కూతురితో గొడవపడే అల్లుడే ఆమెను హత్య చేశాడని ఆరోపించారు.
శిరీష ఘటన మరువకముందే!, మరో వివాహిత ఆత్మహత్య!.. హత్యే అంటున్న కుటుంబ సభ్యులు
ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పూట తన కూతురికి ఫోన్ చేసి.. ఇంటికి వస్తున్నావా? అని ఆరా తీసినట్లు పద్మజ తండ్రి నాగేశ్వరరావు తెలిపారు. బట్టలు ఆరేశానని.. వాటిని తీసేశాక వస్తానని కూతురు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. అయితే సాయంత్రం 4గం. వరకు కూతురి నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. అలానే చూస్తూ కూర్చున్నామన్నారు.
ఇంతలో తమ అల్లుడు గిరీష్ ఫోన్ చేసి.. పద్మజకు ముక్కులు, చెవుల నుంచి రక్తం వస్తుందని, ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పినట్లు వివరించారు. వెంటనే తాము ఆసుపత్రికి కారులో బయలుదేరగా.. అక్కడికెళ్లేసరికే కూతురిని ఐసీయూలో పెట్టారని అన్నారు. తొలుత వైద్యులు తమకేమి చెప్పలేదని, కాసేపటికే పద్మజ చనిపోయిందన్న వార్త చెప్పారని ఆవేదన చెందారు.
పద్మజ ముఖంపై, శరీరంపై గాయాలు ఉన్నాయని నాగేశ్వరరావు తెలిపారు. గతంలోను గిరీష్ తమ బిడ్డను చాలాసార్లు కొట్టాడని, నా కూతురిని అతనే హత్య చేశాడని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. కాగా, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్ గా పనిచేస్తున్న పద్మజకు ఏడాది క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గిరీశ్ నర్సింహతో వివాహమైంది. వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వస్తున్నట్లు సమాచారం.