రోహిత్ ఫ్యామిలీకి రూ.5 కోట్లివ్వండి: అసద్, దత్తాత్రేయని టార్గెట్ చేయడం వెనుక..?
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం డిమాండ్ చేశారు. హెచ్సియు విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నామన్నారు.
రోహిత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్ర రావును బర్తరఫ్ చేయాలన్నారు. ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే రోహిత్ మృతి పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయాలన్నారు. వీసీ అప్పారావు స్వచ్చంధంగా వైదొలగాలన్నారు.
మేం జోక్యం చేసుకోలేదు: దానం
రోహిత్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ అన్నారు. దళితుల్లో చైతన్యం తెచ్చేందుకు తాము కార్యక్రమాలు చేపడతామన్నారు. గతంలో విశ్వవిద్యాలయాల్లో ఎన్ని జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాలు, నేతలు జోక్యం చేసుకోలేదన్నారు.
దత్తాత్రేయ కారణం: తమ్మినేని
రోహిత్ మృతికి దత్తాత్రేయ కారణమని తమ్మినేని వీరభద్రం అన్నారు. దత్తాత్రేయను, వీసీని బర్తరఫ్ చేయాలన్నారు. రోహిత్ మృతి హెచ్సియు సమస్య మాత్రమే కాదని, దేశ సమస్య అన్నారు. రోహిత్ మృతి కారకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి కూడా అన్నారు. రోహిత్ మృతి పైన సమగ్ర విచారణ జరపాలని హెచ్చార్సీలో పిడమర్తి రవి ఫిర్యాదు చేశారు.
ఎనిమిది గంటలుగా ద్విసభ్య కమిటీ విచారణ
రోహిత్ మృతి నేపథ్యంలో కేంద్రం వేసిన ద్విసభ్య కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విచారణ జరుపుతోంది. విద్యార్థులతో, అధ్యాపకులతో, నాన్ టీచింగ్ స్టాఫ్తో కమిటీ సభ్యులు షకీలా టి శంషాద్, సూరజ్ సింగ్ మాట్లాడారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని, సస్పెండైన విద్యార్థులతోను మాట్లాడుతామని చెప్పారు. రాత్రి ఏడు గంటలలోపు ఎవరు సమాచారం ఇచ్చినా తీసుకుంటామన్నారు.
దత్తాత్రేయ లేటర్.. స్మృతీ ఈ-మెయిల్.. రోహిత్ సూసైడ్..!!
రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయనే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే వారిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
అయితే, కేంద్రమంత్రులకు రోహిత్ ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని బిజెపి చెబుతోంది. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మంగళవారం స్పందించారు. దత్తాత్రేయ, స్మృతి ఇరానీల లేఖల కంటే ముందే ఆ విద్యార్థుల పైన విశ్వవిద్యాలయం సస్పెండ్ వేటు వేసిందని చెప్పారు.
దత్తాత్రేయ బిసి కాబట్టి ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్, తెరాస, మజ్లిస్ పార్టీలు బిసి నేత దత్తాత్రేయను లక్ష్యంగా చేసుకున్నారని బిజెపి ఆవేదన వ్యక్తం చేస్తోంది.