అలాగే అనిపిస్తోంది: వరంగల్ ఎన్కౌంటర్పై కోదండరామ్ సంచలనం
హైదరాబాద్: వరంగల్ జిల్లా ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ సంచలన ప్రకటన చేశారు. వరంగల్ ఎన్కౌంటర్ తప్పు అని, అలాంటి సంఘటనలు జరగకూడదని అంటూ తీసుకొచ్చి కాల్చేసినట్లే కనిపిస్తోందని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో విద్యాసాగర్ రెడ్డి, శ్రుతి అలియాస్ మహిత అనే ఇద్దరు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే.
తనకు అధికార దాహం లేదని, తాను ఎల్లవేళలా ప్రజల పక్షమేనని కోదండరామ్ శనివారంనాడు అన్నారు. ప్రతిపక్షాలపై తమకు ఏ విధమైన కోపం లేదని, అయితే వారితో కలిసి పనిచేయలేమని, తమ పంథా వేరని ఆయన చెప్పారు.
తనకు అనుమానం అక్కర్లేదని, ప్రజా సమస్యలపై పోరాడుతానని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్తాన్నది ఊహాగానాలు మాత్రమేనని కోదండరామ్ అన్నారు. ఆత్మహత్యలకు చేసుకున్న రైతుల కుటుంబాలకు జూన్ 2వ తేదీ నుంచి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఎపి అసెంబ్లీలో మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో అరుచుకోవడం మాని ప్రజా సమస్యలపై చర్చించాలని ఆన అన్నారు.