బండి సంజయ్ సారీ చెప్పండి, ఆ దమ్ముందా?: బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పుడు ఐటీఐఆర్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఈ అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీఐఆర్ రాకపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన నేపథ్యంలో ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బండి లేఖ.. అదో అబద్ధాల జాతర
దేశ వ్యాప్తంగా ఐటీఐఆర్ను మూలకు పెట్టింది బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వమేనని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ తేలేని బీజేపీ.. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్ గురించి బండి సంజయ్.. సీఎం కేసీఆర్కు రాసిన లేఖ ఓ అబద్ధాల జాతరగా అభివర్ణించారు కేటీఆర్.
సంజయ్ అజ్ఞానికి అదే నిదర్శనం
ఐటీఐఆర్ కేంద్రమే పక్కన పెట్టిందని, పార్లమెంటులో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై పలుమార్లు ప్రకటనలు కూడా చేశారని కేటీఆర్ తెలిపారు. సొంత పార్టీకి చెందిన కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం సంజయ్ అజ్ఞానానికి నిరద్శనమని తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో కేటీఆర్ దుయ్యబట్టారు.
బండి సంజయ్.. ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ముందా?: కేటీఆర్
బెంగళూరులాంటి నగరంలోనూ ఐటీఐఆర్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, అక్కడ కూడా తమ ప్రభుత్వమే కారణమా? అని నిలదీశారు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, అందజేసిన డీపీఆర్లు బండి సంజయ్కి ఇస్తాం.. ఐటీఐఆర్ తీసుకొచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు కేటీఆర్. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి ఓ ప్రకటన చేయించాలన్నారు.
తెలంగాణ, హైదరాబాద్ ప్రజలకు క్షమాపణలు చెప్పండి..
టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయద్దని కేటీఆర్ బీజేపీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఐటీ రంగం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దేశ వ్యాప్తంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మూలన పడటానికి ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఆరోపణలు దుర్మార్గమని అన్నారు. ఐటీఐఆర్ ఉసురు తీసింది.. ఉత్తరాల పేరుతో డ్రామాలు ఆడుతోంది మీరేనని బండి సంజయ్పై మండిపడ్డారు. తెలంగాణకు ఐటీఐఆర్ రాకపోవడానికి ఎన్డీఏ ప్రభుత్వమే కారణమని.. ఇందుకు బీజేపీ నేతలు తెలంగాణ, హైదరాబాద్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.