మెడికల్ వండర్ : మొబైల్ ఫోన్ సైజులో పుట్టిన చిన్నారిని బ్రతికించారు..
నల్గొండ : నెలలు నిండకముందే జన్మించిన ఓ శిశువు కేవలం 650 గ్రాముల బరువుతో పుట్టింది. దీంతో ఆ పసిపాప బ్రతుకుతుందో లేదో అన్న అనుమానం అటు తల్లిదండ్రుల్లోను ఇటు డాక్టర్లలోను ఆందోళన రేకెత్తించింది. తొలుత ఆసుపత్రిలో చేర్చుకోవడానికి అభ్యంతరం తెలిపిన వైద్యులు, చివరికి ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకోవడమే కాదు పరిపూర్ణ ఆరోగ్యంతో తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేకుండా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాలో నిరుపేద కుటుంబ నేపథ్యానికి చెందిన మమత నెలల నిండకముందే ప్రసవించింది. దీంతో ఆమె ప్రసవించిన చిన్నారి కేవలం 650 గ్రాముల అతి తక్కువ బరువుతో పుట్టింది. అంటే ఓ మొబైల్ ఫోన్ బరువుకు దాదాపుగా సమానం. అయితే, నెలలు నిండకముందే బలహీనంగా పుట్టిన ఆ చిన్నారిని కాపాడుకోవడానికి మమత కుటుంబానికి అంత స్తోమత లేదు.
ఈ క్రమంలోనే నల్గొండ ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించిన మమత తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించాల్సిందిగా అక్కడి వైద్యులను కోరింది.
అయితే చిన్నారి చాలా బలహీనంగా పుట్టడంతో బతికే అవకాశం తక్కువగా ఉన్నందునా, రిస్క్ ఎందుకు అని భావించిన డాక్టర్లు కూడా తొలుత ఆసుపత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు. 1.2 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులు బతకడం కష్టమని చెప్పారు. అయితే వారి పరిస్థితిని అర్థం చేసుకున్న యాదయ్య అనే ఆసుపత్రి వైద్యుడు వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించాడు.
అంతేకాదు, రిషితగా నామకరణం చేసిన ఆ చిన్నారి కోసం ప్రత్యేక సంరక్షణ ఏర్పాట్లు కూడా చేశారు. ఆసుపత్రిలో ఉన్న మొత్తం 26 మంది శిశువుల కోసం నలుగురు ఆయాలు పనిచేస్తోంటే, చిన్నారి రిషిత కోసం ప్రత్యేకంగా ఓ ఆయాను నియమించారు.
ఇలా ఐదు నెలల సంరక్షణ తర్వాత ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంతో 5 కేజీల బరువుకు చేరుకుంది. దీంతో రిషిత తల్లి మమత ప్రభుత్వాసుపత్రి వైద్యులకు క్రుతజ్నతలు తెలిపింది. బతుకుందో లేదో అనుకున్న తన బిడ్డను బతికించారంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇక చిన్నారి గురించి మమతకు కౌన్సెలింగ్ నిర్వహించిన వైద్యులు.. అంబేద్కర్, ఐన్ స్టీన్, పికాసో, వంటి గొప్ప వ్యక్తులంతా నెలలు నిండకముందే పుట్టినా గొప్ప స్థాయికి చేరుకున్నారని ఆమెకు భరోసా కల్పించారు. ఆసుపత్రి వైద్యుల ఆదరణకు కంటతడి పెట్టుకున్న మమత ఇక సంతోషంగా తన బిడ్డను ఇంటికి తీసుకెళ్లడానికి సిద్దమైంది.
ఏదైమైనా.. వైద్యులు మనసు పెట్టాలే గానీ ప్రభుత్వాసుపత్రిలోను ఇలాంటి అద్భుతాలు చోటు చేసుకుంటాయంటున్నారు పలువురు. చిన్నారి రిషితను కాపాడిన నల్గొండ ప్రభుత్వాసుపత్రి వైద్యులు మిగతా ప్రభుత్వాసుపత్రులకు ఆదర్శంగా నిలిచారు.