వద్దు.. ఆ ప్రయత్నాలు విరమించుకోండి.. ఆర్టీసీ అధికారులకు కేసీఆర్ సున్నిత హెచ్చరిక..
తెలంగాణలో ప్రయోగాత్మాకంగా చేపట్టిన కార్గో బస్సు సర్వీసులపై తన ఫోటోను ముద్రిస్తున్నారన్న ప్రచారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. కార్గో బస్సులపై తన ఫోటోలను ముద్రించడం సరికాదన్నారు. ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని సున్నితంగా హెచ్చరించారు.
కార్గో సర్వీసుల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం,ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లడం తమ లక్ష్యమని.. అంతే తప్ప దాని ద్వారా ప్రచారాన్ని కోరుకోవట్లేదని కేసీఆర్ విస్పష్టంగా అధికారులకు చెప్పారు. కార్గో బస్సులపై ఫోటో ప్రతిపాదన చౌకబారు ఆలోచనగా కేసీఆర్ కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే, ఆర్టీసీని లాభాల పట్టించడంలో భాగంగా ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన సరుకును దీని ద్వారానే రవాణా చేయనున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో మందులు,ప్రభుత్వ స్కూళ్లు,కాలేజీలకు పుస్తకాలు,మద్యం షాపులకు వైన్ బాటిళ్లు, ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులన్నీ కార్గో సర్వీసుల ద్వారానే సరఫరా చేయనున్నారు. భవిష్యత్తులో ఈ సేవలను ముంబై,భీవండి,సోలాపూర్,జగ్దల్ పూర్ వంటి ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.