ఆ ఫుటేజీ ఏమైంది?: 'ముమ్మాటికీ హత్యే?' బచ్పన్ యాజమాన్యం ఎందుకు నోరు విప్పట్లేదు..
పోలీసులు, స్కూల్ యాజమాన్యం కుమ్మక్కయ్యే సీసీటివి ఫుటేజీని మాయం చేశారని వారు
హైదరాబాద్: నగరంలోని మల్కాజ్గిరి పరిధిలో ఉన్న బచ్పన్ స్కూల్లో రచిత్ అనే బాలుడు మృతి చెందిన ఘటనపై మిస్టరీ ఇంకా వీడలేదు. బాలుడు సహజంగానే సంపులో పడి మృతి చెందాడా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా అందులో తోశారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
సంపులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి: బచ్పన్ స్కూల్ సీజ్
ఫుటేజీ ఏమైంది?:
బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి సీసీటీవి ఫుటేజీ కీలకంగా మారింది. అయితే ఈ ఫుటేజీ మాయం కావడంతో బాలుడి మృతిపై అనుమానాలను బలపరుస్తోంది. సీసీటీవి ఫుటేజీ ఎలా మాయమైందన్న ప్రశ్నకు స్కూల్ యాజమాన్యం కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.
కావాలనే తొలగించారా?
చిన్నారి మృతిలో నిజనిజాలను నిర్దారించడానికి పోలీసులు, విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్కూల్లో సోదాలు నిర్వహించి సీసీటివి ఫుటేజీని, హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే స్కూల్ యాజమాన్యం సీసీటీవి ఫుటేజీని మాయం చేసిందని నిర్దారించారు.
స్కూల్ బ్యాగ్ మిస్:
నవంబర్ 1 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు వీడియో ఫుటేజీని మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే రచిత్ స్కూల్ బ్యాగ్ మిస్ అవడంపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. సీసీటివి ఫుటేజీ మాయమవడంపై స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం పోలీసులకూ అనుమానం కలిగిస్తోంది.
ముమ్మాటికే హత్యే?
రచిత్ తల్లిదండ్రుల ఆరోపణ మరోలా ఉంది. పోలీసులు, స్కూల్ యాజమాన్యం కుమ్మక్కయ్యే సీసీటివి ఫుటేజీని మాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. రచిత్ మృతిపై వారు డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు.
కాగా, రచిత్ మృతి నేపథ్యంలో అధికారులు స్కూలుకు తాళం వేశారు. మరోవైపు ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులంతా స్కూలుకు తాళం వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 164మంది పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.