ఇవాంకా తడాఖా! బుల్లెట్ ప్రూఫ్ కారు, అయిదంచెల రక్షణ కవచం, ప్రత్యేక ఆయుధాలు!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారైన ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు ఆ దేశాధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే మతిపోతోంది.
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారైన ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు ఆ దేశాధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే మతిపోతోంది.
ఇవాంకా పర్యటన: ఆద్యంతం రహస్యంగా, ఆహ్వానానికీ రావద్దని సూచన, ఎందుకిలా?
Recommended Video
నవంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్కు రాబోతున్న ఇవాంకా ట్రంప్కు ఆ దేశ అధ్యక్షుడి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
చుట్టూ అయిదంచెల సెక్యూరిటీ...
ఇవాంకా ట్రంప్ చుట్టూ అయిదంచెల సెక్యూరిటీ ఉండబోతున్నట్లు అమెరికా భద్రతా వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొదటి రెండంచెల్లో అమెరికా భద్రతా అధికారులే ఆమె చుట్టూ ఉంటారు. ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. మరో నలుగురు ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్న ఈ గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ సమ్మిట్ కు ఇవాంకానే కాకుండా ప్రపంచ దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాంకా ట్రంప్ బస చేయబోయే వెస్టిన్ హోటల్ నుంచి పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంతం వరకు అమెరికా నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. ఇవాంకాకు చుట్టూ మొదటి రెండు అంచెల్లో అమెరికా భద్రతాధికారులు ఉంటే మూడో వలయంలో భారత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) అధికారులు ఉంటారు. ఇక నాలుగు, అయిదు అంచెల్లో తెలంగాణ భద్రతాధికారులు ఉంటారు.
బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్, ప్రత్యేక ఆయుధాలు...
భద్రతా కారణాల రీత్యా ఇవాంకా ట్రంప్ రాకను కూడా అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎప్పుడు దిగుతారో, ఎప్పుడు హోటల్ వెస్టిన్ కు చేరుకుంటారో, ఎప్పుడు సదస్సు జరిగే కన్వన్షన్ సెంటర్ కు చేరుకుంటారో ఎవరికీ తెలియదు. సదస్సు జరిగే ప్రాంతమైన హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ చుట్టుపక్కల దాదాపు 3 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భద్రతాబలగాలు మోహరించనున్నాయి. ఇవాంకా కాన్వాయ్ కోసం ప్రత్యేకంగా అమెరికా నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్లు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇవాంకా పర్యటనలో పాల్గొనే అమెరికా భద్రతాబలగాల చేతుల్లో ప్రత్యేక ఆయుధాలు కనిపించనున్నాయి. అలాగే స్నిఫర్ డాగ్స్ను కూడా. వీటన్నింటీనీ అమెరికా నుంచి ప్రత్యేక విమానాల్లో తీసుకురానున్నారు.
ట్రంప్ కుమార్తెకు కూడా ఆ స్థాయిలోనే...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కల్పించే భద్రత స్థాయిలోనే ఆయన కుమార్తె ఇవాంకాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ వర్గాలే తెలియజేశాయి. ఇవాంకా బస చేయబోయే వెస్టిన్ హెటల్, డిన్నర్ చేయబోయే ఫలక్నుమా ప్యాలెస్ తదితర ప్రాంతాల్లోనూ అయిదంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ప్రదేశాలలో అమెరికా భద్రతా బలగాలు పలుమార్లు తనిఖీలు నిర్వహించాయి. అంతేకాకుండా ఇవాంకా 29వ తేదీన గోల్కొండ కోటను సందర్శిస్తారని, చార్మినార్, లాడ్ బజార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేస్తారనే వార్తలు వెలువడుతున్నా.. ఇప్పటి వరకు వీటిని ఎవరూ నిర్ధారించలేదు. మరోవైపు ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతుండడంతో ఈ వార్తలు నిజం కాకపోయే అవకాశాలూ కనిపించడం లేదు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు...
ఇవాంకా ట్రంప్ పర్యటన సమయంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆమె పర్యటనలో ఫలక్నుమా ప్యాలెస్ కూడా ఉంది. అయితే ఇది పాతబస్తీ ప్రాంతంలో ఉండడం, ఆ ప్రాంతానికి సమీపంలోనే రోహింగ్యా ముస్లింలు నివసిస్తుండడంతో అమెరికా భద్రతా అధికారులు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ, అంగుళం అంగుళం తనిఖీ చేస్తున్నారు.
వెంటాడుతున్న చేదు అనుభవం?
అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ ను ఓ చేదు అనుభవం వెంటాడుతోందట. ఈనెల మొదటి వారంలో జపాన్ లో జరిగిన మహిళా సాధికారత సదస్సులో ఇవాంకా పాల్గొన్నారు. తీరా ఆమె ప్రసంగించడానికి వేదికపైకి వెళ్లేసరికి వినేవారు కరువయ్యారట. ఆ సమయానికి ఆడిటోరియంలో చాలా కుర్చీలు ఖాళీ అవడంతో అమెరికా అధ్యక్షుడి కుమార్తె జపాన్ పర్యటన అభాసుపాలైంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ డైలీమెయిల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ఇప్పుడు తన హైదరాబాద్ పర్యటనలో జపాన్ సీన్ రిపీట్ అవుతుందేమో అని ఇవాంకా తెగ మథనపడిపోతున్నారట. అయితే భారత్ లో అలాంటి పరిస్థితి తలెత్తదని, మహిళా సాధికారిక సదస్సుకు, అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు ఏమాత్రం పొంతన లేదని, ఈ సదస్సుకు దాదాపు 177 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు కూడా హాజరవుతున్నారని అమెరికన్ కాన్సులేట్ అధికారులు ఆమెకు నచ్చచెప్పారట.