ఇవాంకాను ఢిల్లీకి తీసుకెళ్లొచ్చుగా: కేసీఆర్తో పాటు మోడీ టార్గెట్, 'అందగత్తే కాబట్టే'
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, శ్వేత సౌధం సలహాదారు ఇవాంకా ట్రంప్ రాకపై తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె రాక నేపథ్యంలో హైదరాబాదు రోడ్లకు మరమ్మత్తులు చేయడం, గోడలకు రంగులు అద్దడంపై విమర్శలు కూడా వచ్చాయి.
ఇవాంకా ట్రంప్ వెళ్లిపోయిన తర్వాత కూడా ఇంకా ఆమె గురించి చర్చ సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీలు పలు సందర్భాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. జీఈఎస్ సదస్సును కేవలం మంత్రి కేటీఆర్ను ప్రమోట్ చేసేందుకే ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.
ఫలక్నుమా ప్యాలెస్లో విందు పైనా ప్రశ్న
మెట్రో రైలు ప్రారంభోత్సవం, జీఈఎస్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్కు ఎక్కడా ప్రాధాన్యత లేదని, అంతా కేటీఆర్ హడావుడి కనిపించిందని విమర్శిస్తున్నారు. తద్వారా కేసీఆర్ ప్రోటోకాల్ ఉల్లంఘించారని మండిపడ్డారు. ఇవాంకాకు ఫలక్నుమా ప్యాలెస్లో ప్రధాని మోడీ విందు ఇవ్వడాన్ని కూడా ప్రశ్నించారు.
మోడీ ప్రోటోకాల్ ఉల్లంఘించారని
ఇవాంకాకు విందు ఇవ్వాలని ప్రధాని మోడీ భావిస్తే అందుకు ఢిల్లికీ ఆహ్వానించి ఇవ్వాలని, కానీ హైదరాబాదులో ఇవ్వడం ఏమిటని కాంగ్రెస్ నేతలు ఇటీవలే ప్రశ్నించారు. ఇవాంకాకు హైదరాబాదులో విందు ఇవ్వడం ద్వారా మోడీ ప్రోటోకాల్ ఉల్లంఘించారని మండిపడ్డారు.
హోదాతో సంబంధం లేకుండా
మరోవైపు, ఇవాంకా విషయంలో అందరూ అతి చేశారంటూ విమర్శలు వచ్చాయి. ఇవాంకా విషయంలో హోదాతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు, మీడియా పోటీపడ్డాయని అంటున్నారు. ప్రధాని మోడీ పర్యటన కంటే ఇవాంకాకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిన విషయం తెలిసిందే.
ట్రంప్ కూతురు, అందగత్తే కాబట్టే
అంతేకాదు, ఇవాంకా జపాన్లో చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మార్చి హైదరాబాదులో మాట్లాడిందని అమెరికా మీడియాలోను వార్తలు వచ్చాయని అంటున్నారు. ఇవాంకా అమెరికా అధ్యక్షుడి కూతురు కావడంతో పాటు అందగత్తె కావడంతోనే అధిక ప్రాధాన్యత ఇచ్చారని భావించవచ్చునని అంటున్నారు.