గోల్కొండ కోటలో ఇవాంక ట్రంప్: విందు అక్కడే, ట్రాఫిక్ ఆంక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ బుధవారం సాయంత్రంలోగా గోల్కొండ కోటను దర్శించనున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Recommended Video
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ బుధవారం సాయంత్రం గోల్కొండ కోటకు చేరుకున్నారు. భారీ భద్రత నడుమ గోల్కొండ కోటను ఆమె సందర్శిస్తున్నారు. ఇవాంకాతోపాటు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ మాత్రమే ఉన్నారు. సీఎం కేసీఆర్ వస్తారని అనుకున్నప్పటికీ ఆయన రాలేదు. అయితే, విందు సమయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాాచారం.
కాగా, ఇవాంక పర్యటన నేపథ్యంలో పోలీసులు గోల్కొండ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో మంగళవారం ప్రారంభమైన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు ఇవాంకా వచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేయగా, ఆ తర్వాత ఇవాంకా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
ఇవాంకా పుణ్యమా అని.. 'గోల్కొండ' ప్రజల బాధలు తీరాయి!: ఎలాగంటే..?
కాలినడకనే ఇవాంకా
ఇవాంకాకు ఇద్దరు గైడ్లు గోల్కొండ ప్రత్యేకతలను చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ 12స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఇవాంకా కాలినడకనే గోల్కొండలోని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. సుమారు గంటపాటు ఇవాంకా కోటను సందర్శించనున్నారు. గోల్కొండ కోటలోని రాణి మహల్, సౌండ్ ఏరియా, తదితర ప్రాంతాలను గైడ్లు ఆమెకు చూపించారు.
విందు అక్కడే
కాగా, బుధవారం ఉదయం నుంచే సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. అమెరికా ఎంబసీ అధికారులు కోటకు చేరుకుని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అదనపు సీపీ స్వాతిలక్రా, డీసీపీ వెంకటేశ్వరరావు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
డీజీపీ మహేందర్రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. జీఈఎస్ సదస్సుకు వచ్చిన 1500 మంది ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రికి గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
చార్మినార్ సందర్శన లేదు
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కాగా, మొదట చార్మినార్ను సందర్శించాలని అనుకున్నా.. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా.. ఇవాంకా ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
గోల్కొండ కోటకు మెరుగులు
ఇది ఇలావుంటే గోల్కొండ కోటకు ఇవాంకా ట్రంప్, అంతర్జాతీయ ప్రతినిధులు రానుండటంతో కోటను సుందరంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం. అంతేగాక, దోమల బెడద లేకుండా నిరంతర ఫాగింగ్ తోపాటు ప్రత్యేకమైన సెంట్లను ఉపయోగించి పరిసర ప్రాంతాలను సువాసనతో వెదజల్లేలా చేశారు.