అమెరికాలో ఇలాంటిది లేదు: గోల్కొండలో ఇవాంక నడక, రాష్ట్ర ప్రభుత్వ విందుకు దూరం
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో గోల్కొండ కోటలాంటిది లేదని వ్యాఖ్యానించారు. ఈ కోటను చూసి ఆమె ముగ్ధురాలయ్యారు.
గోల్కొండ కోట నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసారు. ఆమె కాలి నడకన గోల్కొండ కోటలో తిరిగారు. ఇద్దరు గైడ్లు ఆమెకు గోల్గొండ కోట చరిత్ర గురించి చెప్పారు. పలుచోట్ల తిరిగి ఆమె వారి నుంచి విషయాలు తెలుసుకున్నారు. వాటిని ఆసక్తిగా విన్నారు.
భారీ భద్రత మధ్య గోల్కొండ కోటకు
భారీ భద్రత మధ్య ఇవాంకా గోల్కొండ కోటకు చేరుకున్నారు. గోల్కొండ కోటకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరు కాలేదు. అయితే ఇవాంకతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శి వచ్చారు.
చార్మినార్కు లేదు, నేరుగా ట్రెండెన్ హోటల్కు
సెక్యూరిటీ కారణాల వల్ల ఇవాంకా చార్మినార్, గాజుల బజార్ను సందర్శించ లేదు. తొలుత చార్మినార్ను చూస్తారని భావించారు. కానీ భద్రతా కారణాల వల్ల అది కుదరలేదు. గోల్కొండ కోటను చూసిన అనంతరం ఇవాంకా ట్రంప్ నేరుగా ట్రెండెన్ హోటల్కు వెళ్లారు.
అక్కడే స్టాల్స్ ఏర్పాటు
ఆమె చార్మినార్, గాజుల బజార్ను సందర్శించనందున గోల్కొండ కోటలోనే ఆమె కోసం కొన్ని గాజుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ పనితీరును తెలియజేసే 12 స్టాల్స్ను ఉంచారు. ఇవాంకా కోటలో దాదాపు అరగంట పాటు గడిపారు. నిజాం కాలానికి ముందు, ఆ తర్వాత కోట గురించి విషయాలు అడిగి తెలుసుకున్నారు.
బ్యాటరీ కార్లు ఏర్పాటు చేశారు కానీ
ఇవాంకా చారిత్రక కట్టడాలను వీక్షించేందు కోసం ప్రభుత్వం బ్యాటరీ కార్లను ఏర్పాటు చేసింది. కానీ ఆమె నడుచుకుంటూనే కోట చారిత్రక విషయాలను తెలుసుకున్నారు. గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం విందును ఏర్పాటు చేసింది. కానీ ఇవాంకా పాల్గొనే అవకాశం లేదు.