దుమారం రేపుతున్న కోదండరాం వ్యాఖ్యలు : ఫోన్ ట్యాపింగ్ నిజమేనా?
హైదరాబాద్ : నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా..? ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న అనుమానం వ్యక్తం చేశారా..? అన్న దానిపై స్పష్టత లేదు గానీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపేవిగా మారాయి. కోదండరాం లాంటి మేధావుల ఫోన్లు ట్యాప్ అవడమంటే..! ఖచ్చితంగా ఆ అప్రతిష్ట ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసేదే అవుతుంది.
ఇంతకీ కోదండరాం ఏమన్నారంటే..' నా ఫోన్ ట్యాప్ అవుతుందోన్న దానిపై నాకు పూర్తి సమాచారం ఉంది. అయితే సరైన సాక్ష్యాధారాలేవి లేనందువల్లే మౌనంగా ఉంటూ వస్తున్నా.. ఈమధ్య మీడియాలో దీనిపై వార్తలు రావడంతో.. ఇప్పుడు దీనిపై స్పందించాల్సి వచ్చింది' అన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు కోదండరాం.
70వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల మనిషినని వాళ్ల తరుపున పనిచేస్తున్నందు వల్ల తనకేమి ప్రమాదం లేదని అందువల్లే దీనిపై ఎలాంటి ఫిర్యాదులకు పోదలుచుకోలేదని చెప్పుకొచ్చారు కోదండరాం. ఇలాంటి చర్యలు సత్సాంప్రదాయానికి మచ్చ తీసుకొస్తాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. నేరస్తుల విషయంలో అయినా సరే ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ద రీతిలోనే చేయాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వం స్పందిస్తుందా..?
ప్రభుత్వ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ.. కోదండరాం చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయనడంలో సందేహం లేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ తనకు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే కోదండరాం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంటే.. వ్యక్తిగత స్వేచ్చను హరించడమే కాబట్టి, ఇదొక అభద్రత భావానికి గురిచేసే విషయంగా పరిగణించాల్సి ఉంటుంది.
మరి కోదండరాం చేసిన వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం స్పందిస్తుందా..? ప్రత్యక్షంగా ఇదే విషయాన్ని ప్రస్తావించకపోయినా..! కోదండరాం లాగే పరోక్ష వివరణ ఏమైనా ఇచ్చే ప్రయత్నమేమైనా చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.