ఓటుకు నోటు కేసు: చంద్రబాబుపై కోదండరామ్ కామెంట్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) చైర్మన్ కోదండరామ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం - 214లోని సెక్షన్ 8పై వివాదాలు సృష్టించవద్దని ఆయన ఆంధ్రప్రదేశ్ నాయకులకు సూచించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని ఆయన అన్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన కేసును రెండు ప్రాంతాల తగాదాగా చూడడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కేసును అవకాశంగా తీసుకుని ప్రాంతాల విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య గొడవలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 21వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ వేడుకలను ఘంగనా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
సెక్షన్-8 పేరుతో హైదరాబాద్లో అధికారాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని కోదండరాం ఆరోపించారు. సెక్షన్-8 అనేది పరిమితమైన అధికారం మాత్రమేనని, ఇది రాజ్యంగ స్పూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ సమాజం దీన్ని ఆమోదించదని అన్నారు. కేంద్రం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల మధ్య ఘర్షణ ఉండొద్దని ఆయన సూచించారు. ఏడాది కాలంలో హైదరాబాద్లో శాంతియుత వాతవరణం ఉందని చెప్పారు. ప్రజల మధ్య పాలకులు వైషమ్యాలు సృష్టించరాదని హితవు పలికారు. వ్యక్తి గతమైన కేసులు కోర్టుల్లో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పోలీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం విజ్ఞతతో కూడిన నిర్ణయమన్నారు.
జయ, లాలూ బాటలో బాబు నడవాలి
నోటుకు ఓటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న చంద్రబాబు నాయుడు తక్షణమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. గతంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్ తమ తమ ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని ఆయన బుధవారం మీడియా సమావేశంలో గుర్తు చేశారు.
చంద్రబాబు కూడా వారి బాటలోనే నడవాలని, పదవి నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్పై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు.