బెదిరేది లేదు.. ఇక పోరాటమే: నయా జాగీర్ పాలనంటూ కేసీఆర్కు కోదండరాం హెచ్చరిక!
టీఆర్ఎస్ బంగారు తెలంగాణను నిర్మిస్తుందని ప్రజలు విశ్వసించారని, కానీ అందుకు విరుద్దంగా పాలన కొనసాగుతుందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా లేదంటున్నారు జేఏసీ చైర్మన్ కోదండరామ్. ఏ పాలనైతే వద్దనుకుని తెలంగాణ సాధించుకున్నామో.. అలాంటి పాలనే ఇప్పుడు నడుస్తోందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలన నయా జాగీర్ వ్యవహారాన్ని తలపిస్తోందని మండిపడ్డారు.
టీఆర్ఎస్ బంగారు తెలంగాణను నిర్మిస్తుందని ప్రజలు విశ్వసించారని, కానీ అందుకు విరుద్దంగా పాలన కొనసాగుతుందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. మిషన్ కాకతీయ, భగీరథ పనులు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోగలిగితే.. రాష్ట్రంలో అందరికి ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చునని అన్నారు.
ప్రభుత్వం తీరుతో ఓపిక నశించిపోయిందని, ఇక మిగిలింది పోరాటమేనని కోదండరామ్ తేల్చి చెప్పారు. విలువల కోసం తాము పోరాటాన్ని కొనసాగిస్తామని, ప్రభుత్వం పెట్టే కేసులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సహాయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.