మాకు లేకుండా కుట్ర, పలుకుబడితో చంద్రబాబు స్వాధీనం: జగదీశ్వర్, పొగిడారని కెటిఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంగళవారం నాడు నిప్పులు చెరిగారు. సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు వ్యవసాయం, పరిశ్రమలు లేకుండా ఏపీ ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తోందని మళ్లీ విరుచుకుపడ్డారు.
తెలంగాణ హక్కుల గురించి విపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిదీశారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాస్తోందని, దీని పైన విపక్షాలు ఎందుకు నిలదీయడం లేదన్నారు. తన పలుకుబడితో సీలేరు ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారన్నారు.
2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. 2018-19 వాటికి 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. వచ్చే మార్చి నుంచి 9 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారు.
రాబోయే నాలుగేళ్లలో విద్యుత్ లోటు లేకుండా చూస్తామన్నారు. మణుగూరులో 1080 మెగావాట్ల విద్యుత్ లక్ష్యమని చెప్పారు. తెలంగాణకు విద్యుత్ వాటా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
కేంద్రం చెప్పింది: జలహారంపై కెటిఆర్
వాటర్ గ్రిడ్ (జలహారం) పూర్తయితే దేశానికే దిక్సూచి అవుతుందని కేంద్రం చెప్పిందని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జలహారం పూర్తి చేస్తామన్నారు.
80 శాతం నీళ్లు ఇచ్చామని చెబుతున్న వాళ్లు దానిని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. వాటర్ గ్రిడ్ పైప్లైన్లు భవిష్యత్కు లైఫ్లైన్లని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. శాసనసభలో వాటర్ గ్రిడ్పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏ ఆడబిడ్డ మంచినీటి కోసం బిందె పట్టుకొని రోడ్డెక్కకూడదన్నారు. అందుకే వాటర్ గ్రిడ్కు శ్రీకారం చుట్టామన్నారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ అమలుచేసిన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తున్నారని, సీఎం కేసీఆర్ చిత్తశుద్ది ఉన్న నాయకుడన్నారు.
మొత్తం 1.25 లక్షల కిలోమీటర్ల మేర వాటర్గ్రిడ్ పైప్లైన్లను చేపడుతున్నామని, గతంలో వేసిన పైప్లైన్లను తెలంగాణ డ్రింకింగ్ వాటర్గ్రిడ్కు అనుసంధానం చేస్తామన్నారు. గ్రావిటీ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేసేందుకు రూపకల్పన చేశామన్నారు.
ప్రాజెక్టు దీర్ఘకాలికంగా మనగలగాలంటే పకడ్బందీగా రూపొందించాలన్నారు. ప్రస్తుతం 106 వాటర్గ్రిడ్ ప్లాంట్లు ఉన్నాయని, రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ మంచి నీరు అందిస్తామన్నారు. వాటర్ గ్రిడ్పై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయన్నారు.
గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజల దాహార్తిని తీర్చలేదన్నారు. గత పాలకులు పెద్దపెద్ద ప్రాజెక్టుల డిజైనింగ్ను కాంట్రాక్టర్లకే అప్పగించేవారని ఆరోపించారు. జలహారం పూర్తైతే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
కృష్ణా బేసిన్లో ఉన్న నల్గొండ జిల్లాను సైతం ఫ్లోరైడ్ మహమ్మారి పీడిస్తోందని, దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. వాటర్ గ్రిడ్ పూర్తైతే దేశానికే ఆదర్శమవుతుందని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ప్రశంసించారన్నారు.