రాధాకృష్ణా! పిచ్చి చేష్టలు మానుకో: జగదీష్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు మతి భ్రమించిందని మంత్రి జగదీశ్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాధాకృష్ణ మానసిక స్థితి సరిగా లేదన్నారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణపై విషం కక్కుతూనే ఉన్నాడని మండిపడ్డారు.
బ్లాక్మెయిల్, అక్రమ సంపాదనతో ఇప్పటికైనా రాధాకృష్ణ పిచ్చి చేష్టలు మానుకోకపోతే బుద్ది చెప్పక తప్పదని హెచ్చరించారు. రాధాకృష్ణ చేస్తోన్న వికృత చేష్టలపై పత్రికా రంగం నిపుణులు, మేధావులు ఆలోచించాలని కోరారు.
ఆంధ్రజ్యోతి పత్రిక విలువలను దిగజార్చుతున్నదని విమర్శించారు. రాధాకృష్ణ తెలంగాణలో దొంగలా తయారయ్యాడని మండిపడ్డారు. చంద్రబాబు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఆయన శనివారం మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఏకపక్షమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 98 శాతం హామీలను నెరవేర్చుతుందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని వివరించారు. దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తున్నామన్నారు.
ఏ పార్టీకైనా సరే ఎన్నికలే గీటురాయి అని పేర్కొన్నారు. వరంగల్లో విజయంపై టిఆర్ఎస్కు తిరుగులేదన్నారు. ఒక రాజకీయ పార్టీగా ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. అంతేకాని విజయంపై ఏ మాత్రం అనుమానంలేదన్నారు.