24న కేసీఆర్ జగన్ ల భేటీ ... చర్చ నదుల అనుసంధానమా .. కేంద్రంతో సమరమా ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ లు ఈ నెల 24వ తేదీన భేటీ కానున్నారు.విభజన సమస్యలు, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం గురించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లుగా అధికారులు చెబుతున్నా అంతకుమించిన పొలిటికల్ అజెండా వీరికి ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీ సర్కార్ పై తెలుగు రాష్ట్రాల సీఎంల ఆగ్రహం
ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి సర్కార్ పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్గిమీదగుగ్గిలం అవుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ పై ఆసక్తి నెలకొంది. అటు ఏపీ లోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ బిజెపి నేతలు అధికార పార్టీల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించడం లేదు. విద్యుత్ ఒప్పందాల విషయంలోనూ, పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలోనూ, ఇక రాజధాని వ్యవహారంలోనూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ కు వరుస షాకులు ఇస్తూనే ఉంది.
జగన్ కు షాకులిస్తున్న బీజేపీ
ఇక ఏపీలోని బీజేపీ నేతలు సైతం జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇది జగన్ సర్కార్ కు ఇబ్బంది కలిగిస్తోంది..జగన్ పాలనా వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో బీజేపీని కూడా బలోపేతం చెయ్యటానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలు అధినాయకత్వానికి కూడా జగన్ పాలనా వైఫల్యాలనుతెలియజేసి తదనుగుణంగా ముందుకు సాగుతున్నారు. రాం మాధవ్ వంటి నేతల సూచనలతో పార్టీని బలోపేతం చేస్తున్నారు.
తెలంగాణాలోనూ కేసీఆర్ కు తలనొప్పిగా బీజేపీ
ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బిజెపి ప్రయత్నం చేస్తున్న క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎలాంటి సహకారం అందడం లేదని, పెద్ద ఎత్తున పన్నులు దానికి కడుతున్నా రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధులు గోరంతే అని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ తెలిపారు. ఒక్క రూపాయి సాయం అందడం లేదన్న కెసిఆర్ కేంద్ర సహకారం అందక పోవడం వల్లే బడ్జెట్ ను ఇరవై శాతానికిపైగా తగ్గించినట్లు గా ప్రకటించారు.
భేటీలో చర్చ నదుల అనుసంధానమా..
ఇక పలువురు నేతలు బిజెపి వైపు చూస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్ ఎలాగైనా బిజెపికి బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం వైఖరితో ఇబ్బందికి గురవుతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్న నేపథ్యంలో అటు నదుల అనుసంధానం పైనే కాకుండా, ప్రధానంగా కేంద్రాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపైన కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి
కేంద్రంతో గొడవకు పోతే నష్టం జరుగుతుందని, అలా అని సైలెంట్ గా ఉన్నా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో తమ పార్టీల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యూహాత్మక ఎత్తుగడలను వెయ్యనున్నారని తెలుస్తుంది. రాష్ట్రాల మధ్య వున్నా సమస్యల పరిష్కారం కంటే ఇప్పుడు విపత్తుగా మారుతున్న కేంద్ర వైఖరిపై ఈ భేటీలో చర్చ జరగనుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.