బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టులో జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. అఖిలప్రియ కూడా మరోసారి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video
భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్, జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది ఇలావుండగా, ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో తాజాగా మరో ఇద్దరు నిందితుల పోలీసు కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమి అఖిలప్రియ వ్యక్తిగత సహాయకులు మల్లిఖార్జున్ రెడ్డి, సంపత్లను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితులను బుధవారం చంచల్గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
ఈ కేసులో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఖిలప్రియ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశముందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో న్యాయస్థానం ఆమెకు బెయిల్ నిరాకరించింది.