దేనికోసం?: కేసీఆర్ ప్రభుత్వం తీరుకు నిరసనగా జగ్గారెడ్డి ఆమరణ దీక్ష
హైదరాబాద్: ఆమరణ నిరాహార దీక్ష పేరిట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత తూర్పు జగ్గారెడ్డి వార్తల్లో నిలిచారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులను ప్రభుత్వం బెదిరిస్తూ, భయపెడుతోందని ఆరోపించారు.
లంకలో సీతమ్మలా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులను నిర్బంధించారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 123 జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసినప్పటికీ, ప్రభుత్వం అప్పీల్కి వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రభుత్వం తీరుకు నిరసనగా బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆమరణ నిరాహార దీక్షకు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంటే ప్రభుత్వం వారి పొట్టగొట్టే కార్యక్రమం చేపడుతోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం, పోలీసులతో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని ఆయన ఆరోపించారు. ముంపు గ్రామాల సందర్శనకు వచ్చే ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, వారిపై లాఠీలు ఝళిపించడం లాంటివి ఎంత మాత్రం సహించదగ్గవికాదని మండిపడ్డారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రైతులకు అన్యాయం జరగక్కుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం 123 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు కట్టండి కానీ రైతుల పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములిచ్చిన రైతులకు సరైన నష్టపరిహారం అందడం లేదనేది విపక్షాల వాదన. అంతేకాదు మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదంటూనే కాంగ్రెస్తో పాటు టీడీపీ నేతలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల రైతులతో పాటు రెండు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
తాజాగా జగ్గారెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు చేపట్టం వెనుక కాంగ్రెస్ రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన జగ్గారెడ్డి మల్లన్న సాగర్ ప్రాజెక్టు తన రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే దీక్ష చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.