సరదాగా అన్నది నిజమైంది, వీహెచ్ బ్రేస్ లెట్ వేలం, మిర్చి రైతులకు లాభం
కాంగ్రెస్ అధ్యక్షుడు సరదాగా చేసిన కామెంట్ ను నిజం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. సంగారెడ్డి ప్రజాగర్జన సభకు విచ్చేసిన సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆ బ్రేస్ లెట్ ను శుక్రవారం వేలం వేశారు.
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇచ్చిన బ్రేస్లెట్ రూ.20 లక్షల ధర పలికింది. తాజాగా నిర్వహించిన వేలంలో ఈ మొత్తం లభించింది.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో ఈ బ్రేస్లెట్ను కృషి డెవలపర్స్ భవన నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. జూన్ ఒకటో తేదీన సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే.
మరి మీరేమిచ్చారు?: రాహుల్ గాంధీ
ఈ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సభ కోసం జగ్గారెడ్డి చాలా కష్టపడ్డారని.. ఎంతో ఖర్చు చేశారంటూ రాహుల్ దృష్టికి వీహెచ్ తీసుకెళ్లారు. అప్పుడు రాహుల్ గాంధీ ‘మరి.. మీరేం ఇచ్చారు?' అంటూ వీహెచ్ ను సరదాగా ప్రశ్నించారు.
‘బ్రేస్ లెట్ ఉందిగా’..
దీంతో ‘నా దగ్గర ఏముంది ఇవ్వటానికి?' అని వీహెచ్ బదులిచ్చారు. ఆ సమయంలో వీహెచ్ చేతికి ఉన్న బంగారు బ్రేస్లెట్ను రాహుల్ చూపించటంతో వేదికపై ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.
జగ్గారెడ్డికి బహుకరించిన వీహెచ్...
ఈ ఎపిసోడ్ అక్కడితో ముగియలేదు. తర్వాతి రోజున వీహెచ్ స్పందిస్తూ.. తన బ్రేస్లెట్ను జగ్గారెడ్డికి అందజేస్తున్నట్లు ప్రకటించి.. ఆయనకు బహుకరించారు. తానే స్వయంగా జగ్గారెడ్డి చేతికి తొడిగారు.
ఇదే ఆ బ్రేస్ లెట్...
తాజాగా ఆ బ్రేస్లెట్ను వేలం వేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. వేలంలో వచ్చే మొత్తాన్ని మిర్చి రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వేలంపాట నిర్వహించారు.
రూ.5 లక్షలతో మొదలై...
రూ.5 లక్షలతో ప్రారంభమైన వేలం.. కాసేపటికే రూ.20 లక్షలకు చేరుకుంది. అక్కడితో వేలం ముగిసినట్లుగా జగ్గారెడ్డి ప్రకటించారు. వేలంలో ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆ మొత్తం మిర్చి రైతులకే: జగ్గారెడ్డి
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రూ.4 లక్షలు ఖరీదు చేసే బ్రేస్లెట్ను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న కృషి డెవలపర్స్ సంస్థను అభినందించారు. ఈ మొత్తాన్ని తాము ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన మిర్చి రైతులకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
రూ.20 లక్షల చెక్కు కూడా రెడీ...
ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని వారికి అందజేయనున్నట్లు చెప్పారు. మరోవైపు.. వేలంలో బ్రేస్లెట్ను సొంతం చేసుకున్న వారు.. కాంగ్రెస్ పార్టీ పేరు మీద చెక్ ఇచ్చారు. ఈ వేలంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.