హరీష్ రావు తో భేటీ ఐన జగ్గారెడ్డి..! విషయం అదేనా....?
హైదరాబాద్ : రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ ఒకలాగే ఉండవు. బళ్లు ఓడలు, ఓడలు బళ్లు అవడం కూడా రాజకీయాల్లో సర్వ సాధారణమైన అంశమే. బద్ద శత్రువులుగా ఉన్న నేతలు ఏదో క్షణంలో, ఏదో కారణంతో మిత్రులుగా మారిపోతారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న నేతలు క్షణాల్లో బద్ద శత్రువులుగా మారిపోతుంటారు. ఈ పరిణామాలకు పెద్ద కారణాలు కూడా ఉండవు. విడిపోవడానికి కారణాలు ఎలా ఉండవో కలిసిపోవడానికి కూడా కారణాలు పెద్దగా ఉండవు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తెలంగాణ రాజకాయాల్లో చోటు చేసుకుంది.
మారుతున్న తెలంగాణ రాజకీయాలు..! ఒక్కటవుతున్న శత్రువులు..!!
తెలంగాణ రాజకీయాల్లో వారిద్దరివి వేర్వేరు పార్టీలు. సైద్దాంతికంగా కూడా చాలా వైరుద్యమున్న పార్టీలు. పరస్పరం ఆ ఇద్దరు నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఒక రకంగా వారిద్దరిని రాజకీయ ప్రత్యర్ధులుగా కూడా అభివర్ణిస్తుంటారు విశ్లేషకులు. ఉప్పు నిప్పుగా వ్యవహరించే వీరు మద్య సఖ్యత కుదిరిందా..? మాటా మంతీ కలిసిందా..? రాబోవు రోజుల్లో వారిద్దరూ కలిసిపోతారా..? రాజకీయంగా కూడా ఒకటవుతారా అనే సందేహాలు కలుగుతున్నాయి. పచ్చి గడ్డి వేసీనా భగ్గుమనేంతగా వ్యవహరించే ఆ నేతలు ఎవరో కాదు.. ఒకరు సిద్దిపేట ఎమ్మెల్యే , మంత్రి హరీష్ రావు కాగా, రెండవ వ్యక్తి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి.
మంత్రి వర్గ విస్తరణతో బలపడ్డ టీఆర్ఎస్..! ప్రభావం చూపిస్తున్న హరీష్ రావు..!!
హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి, ఆయనను కలుసుకోవడం ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు, అటు గులాబీ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. సుధీర్గ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికి ఒకరంటే ఒకరు అంటీ ముట్టనట్టే వ్యవహరించారు. మారిన రాజకీయ పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పద్నాలుగు ఏళ్ల తర్వాత హరీష్ రావుతో జగ్గారెడ్డి చర్చలు జరిపారు అదికూడా కలవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులైన హరీష్ రావు, జగ్గారెడ్డి కలిశారు.
హరీష్ రాకతో పలు మార్పులు..! వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్..!!
ఇదిలా ఉండగా మంత్రి హరీష్ రావును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. దాదాపు పద్నాలుగు ఏళ్ల తర్వాత తొలిసారి హరీష్ రావుతో మాట్లాడారు జగ్గారెడ్డి. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన విజ్ఞప్తిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐతే వీరి కలయిక తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశారా? లేదంటే తెర వెనక ఇంకేమైనా మతలబు ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది.
హరీష్ ను కలుసిన జగ్గారెడ్డి..! కారణం అదే అంటున్న సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!
కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అదికార గులాబీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగ్గారెడ్డి సైతం అదికార పార్టీలో చేరతారని పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. కానీ జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరకుండా హరీష్ రావే అడ్డుకున్నారనే ప్రచారం కూడా తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగింది. అంతేకాకుండా హరీష్ రావుపై వీలుచిక్కినప్పుడల్లా జగ్గారెడ్డి విమర్శలు గుప్పిస్తుంటారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చాలా సందర్భాల్లో బహిరంగంగా మండిపడ్డారు. హరీష్ రావుకు చుక్కలు చూపిస్తానంటూ నిప్పులు చెరిగారు. హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి, ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్, అటు గులాబీ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది.