జగ్గారెడ్డి భార్య ప్రచారం, ఫాంహౌస్లో ఫుల్బాటిళ్లని..
మెదక్: మెదక్ ఉప ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి తరపున ఆయన సతీమణి నిర్మలా దేవి శనివారం సిద్దిపేట, మిరుదొడ్డిలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్ పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి తన భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.
సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సొప్పదండి విద్యాసాగర్, నాయకులు కొడూరి నరేశ్, ముదిగొండ శ్రీనివాస్, వెన్నెల మల్లారెడ్డి, ఎల్లం, అంబడిపల్లి శ్రీనివాస్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మిరుదొడ్డిలో జరిగిన కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, నాయకులు ధర్మారావు, బక్కి వెంకటయ్య, రఘునందన్ రావు, విజయలక్ష్మి, పద్మ, సత్తు రాజిరెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
కేసీఆర్ సొంత ప్రయోజనం కోసమే విదేశీ పర్యటనకు వెళ్లారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం జగదేవ్పూర్లో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సింగపూర్ పర్యటన సొంత ప్రయోజనాల కోసమేనన్నారు.
కేసీఆర్ పర్యటనలో వ్యాపారాల గురించి మాట్లాడుకుని వస్తే, కొడుకు కేటీఆర్ సింగపూర్కు వెళ్లి కొనుగోలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవితలు శాపంగా మారారన్నారు. దోపిడీలో పోటీపడుతున్నారన్నారని ఆరోపించారు. రుణమాఫీని కుటుంబంలో ఒక్కరికి ప్రకటించిన కేసీఆర్ పదవులను మాత్రం కుటుంబీకులందరికీ ఇచ్చారన్నారు. ఫాంహౌస్లో పంటలు కాదని ఫుల్బాటిళ్లు లభిస్తాయన్నారు.
ఫాంహౌస్లో ఎకరాకు కోటి రూపాయలు పంట పండిస్తానన్న ముఖ్యమంత్రికి ఈ ప్రాంత భూములన్నీ ఇస్తామని, ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తే చాలని అన్నారు. కేసీఆర్ తనను బెదిరిస్తున్నారని, ఆయన బనాయించిన అక్రమ కేసులన్నీ వెంట్రుకతో సమానమన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ల బెదిరింపులకే భయపడలేదని కేసీఆర్ తనకెంత అన్నారు. రాష్ట్రంలో 100 రోజులపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.