చెప్పిన వాళ్ళని చేసుకోకుంటే కళ్యాణలక్ష్మి ఇవ్వరేమో .. సీఎం కేసీఆర్ తాజా రూల్ పై జగ్గారెడ్డి సెటైర్
సీఎం కేసీఆర్ రైతులు చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ ఉద్యమ సమయలో సీఎం కేసీఆర్ రైతులను కొండెక్కించారని, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మోసం చేశారని ఆయన మండిపడ్డారు . ఇప్పటివరకు రైతుల బతుకులు బాగుపడ లేదని ఆయన పేర్కొన్నారు .
పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించిన కేసీఆర్ .. దక్షిణ తెలంగాణా ఎడారి : వీహెచ్ ఫైర్
తెలంగాణ వచ్చి ఆరేళ్ళు అవుతున్నా రైతుల మొహాలలో సంతోషం లేదని అన్నారు.తెలంగాణ వస్తే పెరుగన్నం తినొచ్చన్నారు.హాయిగా ఉండొచ్చొన్నారని, ఏవేవో చెప్పారని మండిపడ్డారు . పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా రావడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్కు రైతు బంధు గుర్తొస్తుందన్నారు. ఇక రైతు బంధు ఇవ్వాలంటే చెప్పిన పంటనే వెయ్యాలని నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు . ఇక ఈ విషయంలో సెటైర్ వేసిన ఆయన తను చూపించిన అబ్బాయిని చేసుకోవాలని, చెప్పిన వాళ్ళను పెళ్లి చేసుకుంటేనే కల్యాణ లక్ష్మి ఇస్తానని కేసీఆర్ అంటారేమోనని ఎద్దేవాచేశారు.
ఇక రాష్ట్రంలో రైతులకు ఇప్పటివరకు పూర్తిగా రైతు బంధు రావటం లేదని , ఎకరానికి ఐదు వేలు ఇస్తా అన్న కేసీఆర్ ఇవ్వటం లేదని ఆరోపించారు. మంత్రి హరీష్రావు ఉమ్మడి జిల్లా మెదక్కు చేసిందేమీ లేదని పేర్కొన్నారు . సంగారెడ్డిలో హరీష్రావు మీటింగ్ పెడితే హాజరై రైతుబంధుపై నిలదీస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ రైతా..? లేక రాజకీయ నాయకుడా? అన్నది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గా రెడ్డి . గతేడాది రైతు బంధు 60శాతం రాలేదని, ఈ ఏడాది అసలు వస్తుందా? రాదా? అనేది కూడా ఎవ్వరికి తెలియదని జగ్గారెడ్డి అన్నారు.సీఎం కేసీఆర్ పెడుతున్న నిబంధన రైతు బంధు వదిలించుకునే ప్రయత్నమే అనిపిస్తుందని జగ్గా రెడ్డి అభిప్రాయపడ్డారు .