నా భార్య ఓటమి మంచిదే! కేసీఆర్ చెప్పినట్లే.. హరీశ్ రావుకు అభినందనలు: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో తాము ఓడిపోవడమే మంచిదైందని.. ఒకవేళ గెలిస్తే తాము మేన్సిపల్ ఛైర్మన్గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని అన్నారు.
డబ్బులతో గెలచ్చని టీఆర్ఎస్..
ఆదివారం జగ్గారెడ్డి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. డబ్బులతో ఎన్నికలను గెలవచ్చనే కొత్త తరహా విధానాన్ని టీఆర్ఎస్ తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వద్ద డబ్బు లేదని.. ప్రజల ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నాయని జగ్గారెడ్డి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చిందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి అనే చర్చే రాలేదని.. కేవలం డబ్బు ప్రభావమే ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
నా భార్య ఓటమి మంచిదే.. ఎప్పుడూ హీరోనే..
కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. ఓడినా ఎప్పుడూ హీరోనేనని జగ్గారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తన భార్య మున్సిపల్ ఛైర్పర్సన్ కాకపోవడమే మంచిదైందని.. ఓటర్లు తన మీద ఎలాంటి ఒత్తడి లేకుండా చేశారని తెలిపారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు సింగూరు నీళ్లు తీసుకొచ్చే బాధ్యతను ప్రజలు మంత్రి హరీశ్ రావుకు అప్పగించారని అన్నారు.
టీఆర్ఎస్ గెలుపు గొప్పేమీ కాదు..
మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు 5-10 ఓట్ల తేడాతో ఓడిపోయారని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగానే పనిచేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుపు పెద్ద గొప్ప విషయమేం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హరీశ్కు అభినందనలు.. కేసీఆర్ చెప్పినట్లే..
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీలు గెలిచిన ఆర్థిక మంత్రి హరీశ్ రావును అభినందిస్తుననట్లు జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ 100 స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిందని, అందుకు కృషి చేసిన కేటీఆర్ను కూడా అభినందిస్తున్నానని చెప్పారు.
ఆ విషయంలో కేసీఆర్ను చూసే నేర్చుకోవాలి..
అయితే, ఎన్నికల్లో ప్రజలను ఎలా మభ్యపెట్టాలనే విషయం కేసీఆర్ను చూసి నేర్చుకుంటున్నాని జగ్గారెడ్డి చురకలంటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా ప్రజలు కేసీఆర్ వైపే ఎందుకు నిలబడుతున్నారనేది కాంగ్రెస్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.