కేసీఆర్ను అంటే నష్టం, నేను పులినే అనుకోండి, పిల్లినే అనుకోండి: జగ్గారెడ్డి సంచలనం
హైదరాబాద్/మెదక్: సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని, తనను ఏం అనుకున్నా ఫర్వాలేదని వ్యాఖ్యానించారు. తెరాసను విమర్శిస్తే లాభం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల సమయంలోనే రాజకీయం చేస్తానని అన్నారు. వచ్చే అయిదేళ్లు రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పారు. తనకు సీఎం, మంత్రులు సహకరిస్తే సరే, లేదంటే సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని చెప్పారు.
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)
నన్ను పులి అనుకోండి.. పిల్లి అనుకోండి
వచ్చే అయిదేళ్లు తన నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దాని కోసం ముఖ్యమంత్రి, మంత్రులు.. ఇలా ఎవరినైనా కలుస్తానని చెప్పారు. తనను పులి అనుకున్నా, పిల్లి అనుకున్నా మీ ఇష్టమని చెప్పారు. వారం రోజుల ముందు, నెల రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం మానుకోవాలని సొంత పార్టీ కాంగ్రెస్కు హితవు పలికారు.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
కేసీఆర్ను అంటే పార్టీకి నష్టం
తెరాస ప్రస్తుతం అద్భుత విజయం సాధించిందని గుర్తు చేస్తూ, ఇంకా కేసీఆర్ను నిందించడం వృథా అని జగ్గారెడ్డి చెప్పారు. ప్రజలు ఓ తీర్పు ఇచ్చారని, అయినప్పటికీ కేసీఆర్నే అనడం పార్టీకి నష్టమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తెరాస కార్యకర్తలే అన్నారు. కాగా, జగ్గారెడ్డి గురువారం కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వేచి చూస్తా
తాను కేసీఆర్ పాలనపై నాలుగేళ్లు వేచి చూస్తానని జగ్గారెడ్డి నిన్న చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో అన్ని మతాల వారు తనకు ఓటు వేసి గెలిపించారని, ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని అందరూ భావించారని, కానీ ప్రజలు మాత్రం తెరాసకు మరోసారి అవకాశం ఇచ్చారని చెప్పారు. తనకు ఓటు వేసి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన సంగారెడ్డి ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సహకారంతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని చెప్పారు.
సహకరించకపోయినా నాలుగేళ్ల వరకు వెయిటింగ్
తనకు సహకరించినా, సహకరించకపోయినా వచ్చే నాలుగేళ్ల వరకు ప్రభుత్వం, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటింటికీ మంజీరా నీటి సరఫరా, విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం కోరుతానని అన్నారు. నియోజకవర్గ సమస్యలను లేఖల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తన ప్రతిపాదనలను తిరస్కరిస్తే సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తానన్నారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మాత్రం మారేది లేదని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాజకీయంగా తనను అణగదొక్కే ప్రయత్నం చేశారన్నారు. కానీ విఫలమయ్యారని మండిపడ్డారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కేసీఆర్ను సైతం అభినందిస్తానని చెప్పారు. ఈ నెల 17న సంగారెడ్డిలో లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహిస్తానని తెలిపారు.