కేసీఆర్, హరీష్లకి నేనేంటో చూపిస్తా: జగ్గారెడ్డి, 'కలెక్టర్ ఎలా పాసయ్యారో'
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తన పైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తోందని, అలా చేస్తే తన తడాఖా ఏమిటో చూపిస్తానని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం నాడు హెచ్చరించారు. తనను ముట్టుకుంటే బాగుండదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
అమీన్పూర్ భూముల విషయంలో తనను జైలుకు పంపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జైలుకైనా వెళ్తాకాని జైలుకైనా వెళ్తాకాని తెరాసలో మాత్రం చేరబోనన్నారు. తనను టార్గెట్ చేస్తే మంత్రి హరీష్ రావుకు విశ్వరూపం చూపిస్తానిన్నారు.
కేసీఆర్ పాలనపై దామోదర ఆగ్రహం
తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఆదివారం ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్మాణానికి గ్రామసభల అనుమతి అవసరం లేదని కలెక్టర్ చెప్పడం విడ్డూరమన్నారు.
మెదక్ కలెక్టర్ ఐఏఎస్ ఎలా పాసయ్యారో అర్ధంకావడం లేదని ప్రశ్నించారు. అధికారుల ప్రజాప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వ దోచుకుంటుందని మండిపడ్డారు. నిర్వాసితులకు 2013 జీవో ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాగా, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటోందని దామోదర శనివారం విమర్శించారు. తెలంగాణలో బలవంతపు భూసేకరణ జరుగుతోందన్నారు. దాని వల్ల దళితులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇదే అంశంపై ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో ఐదు పేజీల ప్రతులు అందించారు.