ప్రాణాలు పోతున్నాయి..పట్టించుకోండి: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్లకు జగ్గారెడ్డి లేఖ
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్లకు లేఖలు రాశారు. క్యాన్సర్ వ్యాధికి ఉచిత చికిత్స అందించాలని ఈ లేఖలో ఆయన కోరారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జగ్గారెడ్డి ఆవేదన
డెంగ్యూ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయని జగ్గారెడ్డి తెలిపారు. అంతేగాక, క్యాన్సర్ వల్ల ఎక్కువగా పేద ప్రజలే చనిపోతున్నారని.. డబ్బుల్లేక వారు చికిత్స చేయించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్య అందరిదీ..
క్యాన్సర్ మహమ్మారికి గురైతే పేదలు ఆస్తులు అమ్మినా పూర్తిస్థాయిలో చికిత్స చేయించుకోలేకపోతున్నారని ఆయన తెలియజేశారు. ఇది సంగారెడ్డి నియోజవర్గం సమస్య కాదని.. ఈ సమస్య అందరిదీ అని ఆయన అన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
కేసీఆర్ను కలుస్తా..
అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం సహాయంతో క్యాన్సర్కు ఉచితంగా చికిత్స చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయతనిస్తున్నాననీ.. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు. కాగా, గతంలో సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి.. గత కొంత కాలంగా కేసీఆర్ అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం. కేసీఆర్ తోపాటు కేటీఆర్పై అప్పుడప్పుడు ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారు.
జగ్గారెడ్డి పయనమెటు?
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ విషయంపై జగ్గారెడ్డి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, మంత్రి హరీశ్ రావుపై మాత్రం ఆయన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్లో మంత్రి హరీశ్ రావును జగ్గారెడ్డి కలవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 14ఏళ్ల తర్వాత హరీశ్ రావును జగ్గారెడ్డి కలవడం గమనార్హం. అరగంటపాటు జరిగిన ఈ భేటీలో సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హరీశ్ రావును జగ్గారెడ్డి కోరారు. దీనికి మంత్రి హరీశ్ రావు కూడా సానుకూలంగా స్పందించారు.