ఆ స్థానాలలో కాంగ్రెస్ గెలుపును దేవుడు కూడా ఆపలేడు.. జగ్గారెడ్డి సంచలనం
Recommended Video
తెలంగాణాలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అని అలాగే లోక్ సభ ఎన్నికల్లో గెలిచినా తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తుందని జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యలు విన్నవారు ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వుంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అంటున్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడి
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇస్తుంది అన్న జగ్గారెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో ముందస్తుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలను మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక పక్క వలసలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ను దెబ్బ కొడుతున్నా లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించటం కోసం కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడ్డారు . అందులో భాగంగానే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి విజయం సాదించేందుకు బలమైన ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. కాగా మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లలో గట్టిగానే తలపడ్డామని హస్తం పార్టీ నేతలు ధీమావ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపధ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన జగ్గారెడ్డి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ విజయాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీ తల పట్టుకుంటుందని, ఓటమితో కుమిలిపోవడం ఖాయమని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కి పోటీగా ఎదురు నిలిచే నాయకులను బరిలోకి దించిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు జగ్గారెడ్డి. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇస్తుందన్నారు.
ఆ అయిదు కీలక స్థానాల్లో విజయం సాధించేది కాంగ్రెస్ .. వారి విజయం దేవుడు కూడా ఆపలేడన్న జగ్గారెడ్డి
తెలంగాణలో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, వారి విజయాన్ని దేవుడు కూడా ఆపలేరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి (మల్కాజ్గిరి), ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ), రేణుకా చౌదరి (ఖమ్మం), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (భువనగిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) ల గెలుపు ఖాయమని స్పష్టంచేశారు జగ్గారెడ్డి. కాగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రేణుక చౌదరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రమంత్రి పదవులు వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . అంతేకాకుండా తాను పార్టీ మారతానని వచ్చినటువంటి వార్తలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళేదిలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
జగ్గా రెడ్డి తాజా వ్యాఖ్యలపై పార్టీ శ్రేణుల్లో చర్చ
ఇటీవల కాలంలో జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దాదాపు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టేవిగా ఉంటే తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాంగ్రెస్ కు కాస్త ఊరట అనిపించేలా చేశారు. నిన్నటి వరకు పార్టీ మార్పుపై ఊగిసలాట సాగించిన జగ్గారెడ్డి ఫైనల్ గా కాంగ్రెస్ లో ఉంటానని చెప్పారు కానీ ఆయన మాటలు ఏ మేరకు నమ్మొచ్చో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే స్థానాలపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.