చించావు పో.. హీరోయిన్ రష్మికపై జగిత్యాల జిల్లా కలెక్టర్ వివాదాస్పద ట్వీట్
జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. హీరోయిన్ రష్మికా మందన్నా ఫోటోకు తన ట్విట్టర్ ఖాతా నుంచి పెట్టిన కామెంట్ ఆయన్ను వివాదంలోకి నెట్టింది. అయితే అది తాను పెట్టిన కామెంట్ కాదని,ఎవరో ఆకతాయిలు తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఇంతకీ కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి రష్మికా ఫోటోపై పెట్టిన ఆ కామెంట్ ఏంటి..
వివాదాస్పద కామెంట్
ఇటీవల హీరోయిన్ రష్మికా మందన్నా భీష్మ ప్రీరిలీజ్ ఫంక్షన్కు ముందు ఓ ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఫోటోకి అనూహ్యంగా జగిత్యాల కలెక్టర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఓ కామెంట్ వచ్చింది. 'చించావు పో..' అని ఉన్న ఆ కామెంట్ను చదివి నెటిజెన్స్ షాక్ తిన్నారు. ఓ కలెక్టర్గా ఓ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలాంటి కామెంట్స్ పెట్టడమేంటి అనుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు..
రష్మికా ఫోటోకి తన ట్విట్టర్ ఖాతా నుంచి కామెంట్ వెళ్లడం కలెక్టర్ను కూడా షాక్ తినేలా చేసింది. వెంటనే అప్రమత్తమైన ఆయన జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి ఆ కామెంట్ పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపించాలని కోరారు. కలెక్టర్ విజ్ఞప్తి మేరకు పోలీసులు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
రష్మికా ఫోటోపై కలెక్టర్ కామెంట్ సోషల్ మీడియాతో పాటు అధికారిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ను బద్నాం చేసేందుకే ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ కూడా ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే కలెక్టర్ ట్విట్టర్ హ్యాండిల్ను హ్యాక్ చేసి రష్మిక ఫోటోపై కామెంట్ చేయాల్సిన అవసరమేంటి అన్న చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి పోలీసుల విచారణ పూర్తయితే తప్ప ఇందులో అసలు వాస్తవమేంటో బయటపడేలా లేదు.