అజాతశత్రువుకు కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్ అంత్యక్రియలు
హైదరాబాద్ : రాజనీతిజ్ఞుడు, అజాతశత్రువు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. నెక్లెస్ రోడ్ పీవీ ఘాట్ సమీపంలో అంతిమ సంస్కరాలను ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి నిర్వహించారు. జైపాల్ రెడ్డికి కడసారి వీడ్కోలు పలికేందుకు పార్టీలకతీతంగా నేతలు తరలివచ్చారు.
అంతకుముందు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి గాంధీభవన్కు జైపాల్ రెడ్డి మృతదేహాన్ని తరలించారు. అక్కడ తమ నేతను కడసారి చూసేందుకు శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులు జైపాల్ రెడ్డి పార్థీవదేహానికి అంజలి గటించారు. జైపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. 1964 నుంచి తనకు జైపాల్ రెడ్డితో సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు మల్లిఖార్జున ఖర్గే. విద్యార్థి దశనుంచి ఆయన పరిచయమని తెలిపారు.
జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కే కేశవరావు, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, జేసీ దివాకర్ రెడ్డి, డీకే అరుణ, చిన్నారెడ్డి, డీ శ్రీనివాస్, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, హరీశ్ రావు , గుత్తా సుఖేందర్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భగా జైపాల్ రెడ్డిని స్మరించుకున్నారు.