తెలంగాణ ఆవిర్బావంలో జైపాల్ రెడ్డి కృషి ఎంతో ఉంది.!మెట్రో రైల్ కు ఆయన పేరు పెట్టాలన్న రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ : అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత దివంగత మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి అని పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణ కల సాకారం కావడంలో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర అని గుర్తు చేసారు. ఈ సందర్బంగా జైపాల్ రెడ్డి కృషిని గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ కు మణిహారమైన మెట్రో రైల్ కు స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పెరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కృషి ఉంది..
గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కు మెట్రో రైలు మాంజూరు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అరుదని, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు జైపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి కొనియాడారు.
హైదరాబాద్ కు మెట్రో రైలు మాంజూరు చేయించింది జైపాల్ రెడ్డే..
ఢీల్లీకి వెళ్లినా జైపాల్ రెడ్డి, తెలంగాణ సమస్యల విషయంలో రాజీ పడలేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మొట్టమొదట కృషి చేసింది జైపాల్ రెడ్డి అని తెలిపారు. డెబ్బయ్యో దశకంలోనే మారుమూల పల్లెలకు కరెంటును తీసుకొచ్చి పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన వ్యక్తి అని ఆయన చెప్పారు. ఎవరినీ విమర్శించకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని, అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత జైపాల్ రెడ్డిదని రేవంత్ అన్నారు.
నెక్లెస్ రోడ్ లో జైపాల్ రెడ్డి విగ్రహం పెట్టాలి..
అలాంటి ఆయనకు తాము బంధువులమని తెలిపారు. తాము ఆయన రాజకీయ వారసులం కాదని, పార్టీలకు అతీతంగా ఆయనకు రాజకీయ వారసులు ఉన్నారని తెలిపారు. ఆయన ఎంతో మంది నాయకులను తయారు చేశారన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో దివంగత ప్రధాని పీవీ విగ్రహం ఏర్పాటు చేసినట్లే.. చివరి వరకు రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన నాయకుడి జైపాల్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి.
ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలి..
అంతే కాకుండా తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, సున్నితమైన ప్రజల మనోభావాలను శ్రీమతి సోనియా గాంధీకి వివరించడంలో జైపాల్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించాడని, తెలంగాణలో ఉద్యమ సందర్బంగా క్షేత్ర స్ధాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు సోనియా గాంధీ అనేక సార్లు జైపాల్ రెడ్డి తో సంప్రదింపులు జరిపిందని గుర్తు చేసారు.
జైపాల్ రెడ్డి నుండి నివేదిక వచ్చిందంటే అది వాస్తవం అని సోనియా గాంధీ విశ్వసించేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. తెలంగాణ కల నెరవేరడంలో తెర వెనక జైపాల్ రెడ్డి చేసిన కృషిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సరైన స్థానం కల్పించాలన్నారు రేవంత్ రెడ్డి.