'పాకిస్తాన్పై మోడీ అలా, తెలంగాణలో కేసీఆర్ ఇలా, దేశంలో అలాంటి సీఎం ఇతనే'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ సర్కార్ ప్రజలను అంశాల వారీగా విభజిస్తోందని జైపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.
చరిత్ర తెలియని వారు బీజేపీలో నాయకులుగా ఉన్నారన్నారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయినా మారడం లేదన్నారు. ఇండియన్ ఆర్మీని ప్రధాని మోడీ ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చడం సరికాదన్నారు.
మోడీ ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆరెస్సెస్ శిక్షణ వల్లే సర్జికల్ దాడులు అని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పడం విడ్డూరమన్నారు. గతంలోను సర్జికల్ దాడులు జరిగాయన్నారు. కానీ ఇప్పుడే జరిగినట్లు బీజేపీ ప్రచారం చేస్తోందన్నారు.
ఎన్నికల హామీలలో బీజేపీ విఫలమైందన్నారు. అందుకే పాకిస్తాన్తో యుద్ధం వస్తే లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. గతంలో ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలు ధైర్యంగా పాక్తో యుద్ధం చేశారన్నారు. మత నియమాలను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందన్నారు.
కామన్ సివిల్ కోడ్ పైన అన్ని పార్టీలతో చర్చించాలన్నారు. ఏకాభిప్రాయం కుదిరితే తేవాలి తప్ప ఒక మతం పైన కామన్ సివిల్ కోడ్ రుద్దితే కాంగ్రెస్ పార్టీ అంగీకరించదన్నారు. నల్లధనం పేరుతో చిన్న వ్యాపారులకు నోటీసులు ఇస్తున్నారన్నారు. దళితుల పైన దాడి జరిగితే తలదించుకుంటానని చెప్పిన మోడీ, గుజరాత్లో దళితుల ఊచకోత జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు.
బ్రిక్స్ డిక్లరేషన్లో సిరియా ప్రస్తావన ఉంది తప్ప పాకిస్తాన్ ప్రస్తావన లేదని ఇది మోడీ దౌత్య వైఫల్యం కాదా అని మండిపడ్డారు. దేశంలో వలసలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రే ఇలా ఫిరాయింపులు ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి దుర్దినం అన్నారు.