అదో పెద్ద కుంభకోణం: జైపాల్, మోడీ ఏంటో ప్రజలకు తెలుసంటూ కిషన్ కౌంటర్
హైదరాబాద్: రాఫెల్ డీల్ విషయమై కేంద్ర ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే ఓ పెద్ద కుంభకోణమని జైపాల్ రెడ్డి ఆరోపించారు.
సొంత కారు లేదు, చేతిలో రూ.50వేలు కూడా లేవు!: మోడీ ఆస్తులెంతో తెలుసా?
రాఫెల్ కుంభకోణమే
శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం జరిగిందనేది ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
41వేల కోట్లు నష్టం వచ్చేలా..
రూ. లక్ష కోట్లకు పైగా రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో సంబంధిత మంత్రి మోడీ వెంట లేరు కానీ.. అనిల్ అంబానీ మాత్రం ఉన్నారన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.41వేల కోట్లు నష్టం వచ్చేలా వ్యవహరించారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆయుధాల కొనుగోలు విషయంలో రక్షణ శాఖ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు.
దేశాన్ని ముంచింది కాంగ్రెస్ కాదా?
ఇది ఇలావుంటే, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జైపాల్ రెడ్డి మర్చిపోయి ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి, కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మర్చి పోలేదని అన్నారు. శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బోఫోర్సు కుంభకోణం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముంచిందని అన్నారు.
అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందా?
2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం ద్వారా వందలు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని కిషన్ మండిపడ్డారు.
దేశాన్ని భ్రష్టు పట్టించి అవినీతి గురించి మాట్లాడతారా?
దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీకి అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారంపై రాహుల్ గాంధీ పార్లమెంటులో పసలేని విమర్శలు చేసి నవ్వులపాలయ్యారని అన్నారు. నరేంద్ర మోడీ నిజాయితీ ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని కిషన్ రెడ్డి అన్నారు. మోడీకి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే, రాహుల్ గాంధీల సర్టిఫికెట్ అవసరం లేదని తేల్చి చెప్పారు.